ధర్పల్లి, మే 26: ప్రస్తుతం డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటలను పండిస్తూ.. సొంతగా మార్కెట్ చేస్తూ రైతులు అధిక లాభాలు గడిస్తున్నారు. ఆధునీకతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామస్తులు. ముఖ్యంగా వాణిజ్య పంటల సాగుపై వారు ఆసక్తిని కనబరుస్తున్నారు.
వరిని సాగుచేయకుండా వాణిజ్య పంటలపై దృష్టిపెడుతున్నారు మైలారం రైతులు. వరికి ప్రత్యామ్నాయంగా పసుపు, మిరప, జొన్న, ఎర్రజొన్న, మక్కజొన్నతోపాటు కొత్తిమీర, పుదీన, సజ్జ, నువ్వులు, ఆకుకూరలు అధికంగా సాగుచేస్తున్నారు. వరితో పోలిస్తే వాణిజ్య పంటలు పండించడం శ్రమతో కూడిన పని అయినా లాభాలు ఎక్కువగా ఉండడంతో రైతులు వాటి సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. పంటను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సొంతంగా మార్కెట్ చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు.
అధికారుల సూచనలు పాటిస్తూ..
రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ పంటలను సాగుచేస్తున్నారు. పంట మార్పిడి పద్ధతులను పాటిస్తూ వేసిన ప్రతి పంటలో అధిక దిగుబడి సాధిస్తున్నారు. కొంతకాలంగా పసుపు, జొన్న, సజ్జ, నువ్వులు, మక్కజొన్న పంటలు సాగుచేస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించిన వ్యవసాయాధికారులు సైతం వాణిజ్య పంటలను సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రామానికి చెందిన లోక గంగారెడ్డి అనే రైతు ఎకరంన్నర విస్తీర్ణంలో పుదీన సాగు చేసి రెండు రోజులకు ఒకసారి జిల్లాకేంద్రంలోని ప్రధాన మార్కెట్కు తీసుకెళ్లి అధిక లాభాలను పొందుతున్నాడు. రైతులు కేవలం వరి పంటనే కాకుండా ఇతర పంటలపై ఆసక్తికి చూపుతున్నారు.
కంపెనీలతో ఒప్పందం..
రైతులు వాణిజ్య పంట సాగుచేసే ముందే కంపెనీ వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో కంపెనీ వారే పంట సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మద్దతు ధర తప్పకుండా లభిస్తుందన్న ధీమాతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. పంటకు చీడపీడలు ఆశించినా వ్యవసాయాధికారులు తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ప్రధానంగా పసుపు పంటతోపాటు సజ్జ, జొన్న, నువ్వుల పంటను రైతులు సాగుచేస్తున్నారు.
సందేహాలు తీరుస్తున్నాం..
మైలారంలో రైతులు వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. వారికి ఎలాంటి సందేహాలు ఉన్నా మేము తీరుస్తున్నాం. వారికి ఎప్పటికప్పుడు నూతన సాగు విధానాలు, పంట మార్పిడి, నేల సారం పెంచుకోవడం ఎలా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం.
కొంత కాలంగా జొన్న వేస్తున్న..
నేను కొన్నేండ్లుగా జొన్న పం ట వేస్తున్న. కంపెనీ వారితో ముందే ఒప్పందం చేసుకొని పంట దిగుబడి వచ్చిన అనంతరం వారికే విక్రయిస్తున్న. బయట మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే అక్కడ కూడా అమ్ముకోవచ్చు.