హాసాకొత్తూర్ ఘటనలో నిందితుల కాల్డేటాను పరిశీలించి నిర్ధారించిన పోలీసులు
మరో ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్ : ఏసీపీ రఘు
కమ్మర్పల్లి/భీమ్గల్, మే 26: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్కు చెందిన మలావత్ సిద్ధార్థ మృతి ఘటనలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అతడి తమ్ముడితో పాటు కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మూర్ ఏసీపీ రఘు స్పష్టంచేశారు. భీమ్గల్, కమ్మర్పల్లి పోలీసుస్టేషన్లలో బుధవారం రాత్రి వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కనుక రాజేశ్ కాల్ డాటాను పరిశీలించామని, ఇందులో మంత్రికి, అతడి కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బీఎస్పీ నేత సునీల్రెడ్డి చేసిన ఆరోపణలు, డిమాండ్పై విలేకరులు ప్రశ్నించగా.. రాజేశ్తో పాటు మిగతా నిందితుల డాటాను కూడా పరిశీలించామని ఏసీపీ తెలిపారు. కేసులో పరారీలో ఉన్న నందిపేట్కు చెందిన ఇజాజ్, మోర్తాడ్కు చెందిన రాకేశ్యాదవ్ను మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా నాయ్గావ్లో అరెస్టు చేశామని, బుధవారం రిమాండ్కు తరలించామని చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. సమావేశాల్లో భీమ్గల్ సీఐ శ్రీనాథ్రెడ్డి, ఎస్సై ఎండీ ఆసిఫ్ ఉన్నారు.