ఖలీల్వాడి, మే 26: ఎంపీ అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులను విమర్శించే స్థాయి అతడికి లేదని నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విషయంలో అన్ని పత్రికలు, ప్రపంచ దేశాలు మోదీని విమర్శిస్తున్నాయని, టీవీల్లో ప్రధాని మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు. కానీ సీఎం కేసీఆర్ హైదరాబాద్, వరంగల్ దవాఖానలను సందర్శించి రోగులకు మనోధైర్యాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నిజామాబాద్కు వస్తున్నారని ఊహించుకొని ఎంపీ అర్వింద్ ముందుగానే ప్రభుత్వ దవాఖానకు వెళ్లి రోగులను పరామర్శించారని విమర్శించారు. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందుతున్నదని చెప్పిన ఎంపీ అర్వింద్.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడే దమ్ము ఎంపీకి లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని విమర్శించే అర్హత ఎంపీకి లేదన్నారు. డీఎస్ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లు తీసుకున్న అర్వింద్ వక్రబుద్ధి ఇంకా పోలేదన్నారు. లాక్డౌన్ సమయంలో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. ఇక్కడ రైతుదీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీకి దమ్ముంటే ఆదివారం ఉదయం ఏడు గంటలకు నిజామాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్దకు డిబేట్కు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో నుడా డైరెక్టర్లు రాజేంద్రప్రసాద్, ఎనుగందుల మురళి, జగన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.