సాగుతో భూసారం పెరుగుదల
ఎరువుల ఖర్చు తగ్గుదల
రైతులకు మేలు
భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. అందుకోసం చాలా మంది రసాయన ఎరువులు వాడుతుంటారు. దీంతో నేలల్లో పోషకాలు లోపించి, పంటలు కలుషితం అవుతున్నాయి. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను ఉపయోగిస్తే భూసారం పెరగడంతోపాటు అధిక దిగుబడి వస్తుందని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
-కోటగిరి/ కమ్మర్పల్లి/ రుద్రూర్, మే 25
వరితోపాటు ఏ ఇతర పంటలు సాగు చేసినా ఎక్కువగా యూరియా, ఎన్పీకే ఎరువులనే ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను సాగు చేయడంతో పొలాల్లో సహజంగానే ఈ ఎరువులు ఉత్పత్తి అవుతాయి. భూసారం పెరుగడంతోపాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. పచ్చిరొట్ట మొత్తంగా 16 రకాల్లో లభిస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జీలుగ, జనుము, అవిశ, వెంపల్లి, అలసంద, పిల్లిపెసర, మినుము, గోరు చిక్కుడు, అజొల్ల, కానుగ, వేప, ైగ్లెరిసిడియా, జిల్లేడు, నేతల తంగేడు, కొండ మిరుప మొక్కల ఆకులు సహజ సిద్ధమైన ఎరువులుగా ఉపయోగపడుతాయి.
జీలుగ.. రైతులకు అండగా..
ఈ రకం పచ్చిరొట్ట మొక్కలను చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో వేసుకోవచ్చు. తొలకరి వర్షాలు కురవగానే దుక్కి చేయించి మొదట 20 నుంచి 30 కిలోల యూరియాతోపాటు జీలుగ విత్తనాలు వేయాలి. ఎకరానికి 15 నుంచి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మొక్కలు పెరిగి, పూత దశకు వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. 40 రోజుల తర్వాత అదే పొలంలో రోటోవేటర్ లేదా కేజ్వీల్స్తో కలియదున్నాలి. అనంతరం ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్ వేయాలి. దీంతో మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువులు తయారవుతాయి. కుళ్లే దశలో నీటి తడులు సక్రమంగా ఇవ్వాలి. జీలుగను కలియదున్నిన తర్వాత 10 రోజుల వరకు ఇతర పంటలు సాగు చేయకూడదు. ఈ సమయంలో విడుదలయ్యే మీథేన్ వాయువు పంటలకు హాని కలిగిస్తుంది. దీంతో పొలంలో వేయాల్సిన యూరియా కన్నా 30 నుంచి 32 కిలోలు తక్కువగా వేసినా సరిపోతుంది. వీటి ద్వారా 3.5శాతం నత్రజని, 0.6శాతం భాస్వరం, 1.2శాతం పొటాష్ లభిస్తుంది.
జనుము : ఎకరానికి 9 నుంచి 14 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. దీని ద్వారా ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని పొలంలోనే కలిగియదున్నితే 24 కేజీల యూరియా అందుతుంది. ఇందులోనూ 2.3శాతం నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8శాతం పొటాష్ ఉంటాయి.
పెసర, మినుము : పెసర, మినుముల పచ్చిరొట్టతో ఎకరానికి15 నుంచి 25 కిలోల యూరియా అందిస్తుంది. వరి సాగు చేసే పొలాల్లో వీటిని వేసుకోవడంతో అధిక లాభం ఉంటుంది.
ప్రయోజనాలు
జింకు, మాంగనీసు, ఇనుము వంటి సూక్ష్మధాతువులు పంటకు లభిస్తాయి.
నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదపడుతుంది.
తుంగ, గరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
భూసారం పెరుగడంతో రసాయనిక ఎరువుల వాడకం 50శాతం తగ్గిపోతుంది.
సహజ సిద్ధంగా భూసారం పెరిగి, నాణ్యమైన ఉత్పత్తులను సాధించే అవకాశం ఉంటుంది.
పంట రోగాలను తట్టుకొని నిలబడుతుంది.
సబ్సిడీపై జీలుగ విత్తనాలు..
రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు జనుము విత్తనాలను కూడా పంపిణీ చేస్తారు. 65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందజేస్తున్నారు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు పట్టాపాస్ బుక్ జిరాక్స్, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
పొలానికి బలం..
జీలుగ పచ్చిరొట్ట వాడకంతో పొలానికి బలాన్నిస్తుంది. వడ్లు బాగా వస్తాయి. మంచి లాభమే. ప్రతి సంవత్సరం వరి వేసే ముందు కచ్చితంగా జీలుగ విత్తనాలు చల్లితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి. పచ్చిరొట్ట పద్ధతిని పాటించి అధిక దిగుబడులు సాధిస్తున్నాం. ప్రభుత్వం కూడా రైతుల కోసం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తుంది.
-కొల్లూర్ కిశోర్బాబు, రైతు, కోటగిరి
అందుబాటులో జీలుగ విత్తనాలు
తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి సాధించాలనే లక్ష్యం తో ప్రభుత్వం జీలుగ, జను ము విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఇప్పటికే పలు సహకార సంఘాలకు విత్తనాలు చేరుకున్నాయి. రాబోవు వానకాలం సీజన్లో ఎక్కువ శాతం మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. రైతులు కచ్చితంగా జీలుగ విత్తనాలు నాటాలి. దీంతో భూసారం పెరిగి దిగుబడి ఎక్కువ వస్తుంది.
-శ్రీనివాసరావు,
మండల వ్యవసాయాధికారి, కోటగిరి
సందేహాలుంటే సంప్రదించండి..
పచ్చిరొట్ట నేలసారం పెంచడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. పచ్చిరొట్ట పంటలుగా జీలుగ, జనుము, అలసంద, పెసర, మినుము, పిల్లి పెసర పంటలను వేసుకోవచ్చు. పచ్చిరొట్ట సాగులో సందేహాలుంటే 9989623830, 8978672595 నంబర్లకు సంప్రదించాలి.
-డాక్టర్ సురేశ్, శాస్త్రవేత్త,
కేవీకే సేద్యవిభాగం