తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరిశోధనా నేపథ్యం.. యురేనియంపై అధ్యయనం
32ఏండ్లు ప్రొఫెసర్గా సేవలు
నాలుగో రెగ్యులర్ వీసీగా సోమవారం బాధ్యతల స్వీకరణ
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్చాన్స్లర్ను రాష్ట్రప్రభుత్వం నియమించింది. టీయూ నూతన వీసీగా డి. రవీందర్ నియమితులు అయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణ్పూర్ గ్రామానికి చెందిన రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ భౌతికశాస్త్ర విభాగంలో 32 ఏండ్లు ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది జూన్లో ఉద్యోగ విరమణ చేశారు. 2006లో ఏర్పాటైన టీయూకు ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే రెగ్యులర్ వీసీలుగా పనిచేశారు. వర్సిటీ నాల్గో వీసీగా రవీందర్ నియామకం కాగా.. సోమవారం ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం.
డిచ్పల్లి, మే 22: తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉస్మానియా వర్సిటీ భౌతికశాస్త్ర విభాగపు ప్రొఫెసర్ డి. రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు అందినట్లు సమాచారం. రాష్ట్రంలోని పది వర్సిటీల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీ నివేదిక నాలుగు రోజుల క్రితం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్దకు వెళ్లగా ఆమోదముద్ర వేశారు. దీంతో సీఎం కార్యాలయం నుంచి పది వర్సిటీల ఉపకులపతులకు నియామక ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది.
తెలంగాణ యూనివర్సిటీ 2006లో ఏర్పాటు చేశారు. 15 ఏండ్లు పూర్తిచేసుకున్న వర్సిటీకి మొదట ఓఎస్డీగా ప్రొఫెసర్ సులోచనా దేవి నియమితులయ్యారు. ఆమె వర్సిటీ ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారు. మొదటి వీసీ గా ప్రొఫెసర్ కాశీరాంను నియమించారు. తెలంగాణ వర్సిటీ గిరిరాజ్ కళాశాలలో కొనసాగుతుండగా.. డిచ్పల్లిలో క్యాంపస్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక భవనాలు నిర్మించి యూనివర్సిటీని ప్రారంభించారు. తదనంతరం కొందరు ఇన్చార్జి వీసీలుగా వచ్చిన తర్వాత రెగ్యులర్ వైస్చాన్స్లర్గా ప్రొఫెసర్ అక్బర్అలీఖాన్ నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో వర్సిటీకి యూజీసీ గుర్తిం పు లభించింది. అనంతరం శైలజా రామయ్య ఐఏఎస్ కొంతకాలం ఇన్చార్జి వీసీగా కొనసాగారు. తరువాత రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శిగా ఉన్న చిట్ల పార్థసారథి ఇన్చార్జి వీసీగా నియామకమవగా.. ఆయన వర్సిటీని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. న్యాక్ అక్రిడిటేషన్ సాధించడంలో ఆయన కృషి ఉన్నది. ఆయన తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తన యాస, భాషల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన ప్రొఫెసర్ పి.సాంబయ్య ఉపకులపతిగా నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో హెల్త్ కేర్ సెంటర్, గెస్ట్హౌస్, క్యాంటీన్ తదితర కళాశాల భవనాలు, హాస్టళ్లు నిర్మింపబడ్డాయి. తదనంతరం ఇన్చార్జి వీసీగా అనిల్కుమార్ ఐఏఎస్ ఉపకులపతిగా, ప్రస్తుతం నీతూకుమారి ప్రసాద్ ఐఏఎస్ వైస్చాన్స్లర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారి నుంచి ఇక రెగ్యులర్ వీసీలలో ఇదివరకు ముగ్గురు చేయగా ప్రస్తుతం నాల్గో వీసీగా ప్రొఫెసర్ డి.రవీందర్ రానున్నారు.
రేపు బాధ్యతలు స్వీకరించనున్న వీసీ
టీయూ నూతన వైస్చాన్స్లర్గా నియమితులైన రవీందర్ సోమవారం బాధ్యతలు తీసుకుంటారని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. అత్యంత పరిశోధనాపరమైన నేపథ్యం కలిగిన ప్రొఫెసర్ రవీందర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులైనందుకు ప్రస్తుత ఇన్చార్జి వీసీ, రిజిస్ట్రార్, పాలకమండలి, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిశోధనాపరమైన నేపథ్యం
నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణ్పూర్ గ్రామానికి చెందిన డి.రవీందర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగంలో దాదాపు 32 ఏండ్లు ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించి గతేడాది జూన్లో ఉద్యోగ విరమణ చేశారు. జాతీయ, అంతర్జాతీయపరమైన అవార్డులెన్నో సాధించారు. భారతీయ శాస్త్రవేత్తల్లో అత్యున్నతమైన స్థాయిని కలిగి భౌతిక శాస్త్రంలో యురేనియంపై పరిశోధన చేసిన గొప్ప శాస్త్రవేత్త. అమెరికాకు చెందిన స్టార్ఫోర్ట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక విద్యా పరిశోధనా అంశాల్లో సర్వే చేపట్టి తన ప్రతిభను నిరూపించుకున్నారు. భౌతికశాస్త్ర విభాగంలో నానో టెక్నాలజీ మీద మెటీరియల్ సైన్స్పై పరిశోధన చేసి మంచి పేరు సంపాదించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రొఫెసర్ రవీందర్ చేసిన సేవలకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా 1996లో యంగ్ సైంటిస్ట్ అవార్డును అం దుకున్నారు. అమెరికా, లండన్, కెనడా, స్వీడన్, ఐర్లాండ్, జపాన్ అండ్ సింగాపూర్ మొదలగు దేశాల్లో పర్యటించి పరిశోధన వర్క్షాపుల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 172 పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు. దాదాపు 10 మంది పీహెచ్డీ విద్యార్థులకు సూపర్వైజర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఇప్పటివరకు ఐదు రీసెర్చ్ ప్రాజెక్టులు, డీఎస్టీ, యూజీసీ, సీడబ్ల్యూఏఎస్ ఇటలీలో పూర్తి చేశారు. యూజీసీ కేరియర్ అవార్డును 1994లో అందుకున్నారు.