రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ధర్పల్లిలో ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం
ధర్పల్లి, మే 18: ప్రజలు భయపడకుండా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తతతో కరోనా అరికడుదామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా బారిన పడి హోం ఐసొలేషన్ వసతి లేని వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కేంద్రాన్ని ప్రతిరోజూ వైద్యులు, అధికారులు సందర్శించి పౌష్టికాహారం, మందులు అందజేస్తారని తెలిపారు. ఇంటింటి సర్వేను చేపట్టిన తొలిరాష్ట్రం తెలంగాణ అని, ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా సర్వే చేపట్టేందుకు కేంద్రం యోచిస్తున్నదని చెప్పారు. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. బ్లాక్ ఫంగస్ విషయంలో ఆందోళన చెందవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ధర్పల్లిలో సీపీఎంబీలో పనిచేసే వారితో ధర్పల్లిలో కరోనా పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తున్నామని, దీంట్లో ప్రైవేటు ల్యాబ్ల కన్నా 50 శాతం తక్కువ ఫీజు తీసుకుంటారని చెప్పారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ..
ఇటీవల కరోనా సోకి మృతిచెందిన ధర్పల్లి ఎంపీటీసీ సుజావుద్దీన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం దుబ్బాక గ్రామానికి చెందిన విలేకరి అల్లాడి శేఖర్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి రూ.25 నగదును అందజేశారు. బాధిత కుటుంబానికి రైతుబీమాతో పాటు ప్రెస్ అకాడమీ తరఫున రూ.రెండు లక్షల ఎక్స్గ్రేషియా అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు పీసు రాజ్పాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, సర్పంచులు ఆర్మూర్ పెద్ద బాల్రాజ్, వెంకటేశ్, దుబ్బాక ఎంపీటీసీ పెండ గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు సురేందర్గౌడ్, సుభాష్, కిశోర్రెడ్డి, శేఖర్రెడ్డి, హెచ్.వెంకట్రెడ్డి, హెచ్పీ లింగం, గంగారెడ్డి, తహసీల్దార్ జయంత్రెడ్డి, ఎంపీడీవో నటరాజ్, మెడికల్ ఆఫీసర్ రఘువీర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.