జనాభా ప్రాతిపదికన ఏర్పాటు
ఒకేచోట కూరగాయలు, మాంసం, పండ్ల విక్రయాలు
స్థల సేకరణ పూర్తి చేసిన మున్సిపల్ అధికారులు
ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు
త్వరలోనే టెండర్ల ప్రక్రియ
పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూరగాయలు, పండ్లు, మాంసం ఒకేచోట విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన వీటిని నిర్మించనున్నారు. పట్టణ నడిబొడ్డున ఎకరం నుంచి రెండెకరాల వరకు స్థలం ఉంటేనే మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. స్థల సేకరణ కోసం కలెక్టర్ చైర్మన్గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కన్వీనర్గా, మున్సిపల్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉన్న కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా నిధులు మంజూరు చేయనున్న ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నెల 26వరకు టెండర్లు పిలిచే అవకాశం ఉన్నది.
బాన్సువాడ, మే 18 : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో మున్సిపాలిటీలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. పట్టణాలను అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ శాఖ కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నది. జనాభా ప్రాతిపదికన పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించింది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో సమస్యల మధ్యన కొనసాగుతున్న రోజువారీ మార్కెట్ల స్థానంలో ఆధునిక హంగులతో కొత్త మార్కెట్లు నిర్మించనున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంసం అమ్ముకునేందుకు సమీకృత మార్కెట్లు (ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ), వైకుంఠధామాల నిర్వహణకు ప్రభుత్వం పాలక వర్గాల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ ) ద్వారా నిధులు మంజూరు చేయనున్నారు.
జనాభా ప్రాతిపదికన మార్కెట్ల నిర్మాణం..
2011 జనాభా లెక్కల ప్రకారం 25వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో ఎకరం స్థలంలో రూ. రెండు కోట్లతో సమీకృత మార్కెట్లు నిర్మించనున్నారు. అలాగే 25 వేల జనాభా కంటే అధికంగా ఉంటే రెండు ఎకరాల స్థలంలో మార్కెట్ను నిర్మించేందుకు రూ. 4.50 కోట్ల నిధులు మంజూరు చేస్తారు. అలాగే మున్సిపాలిటీల పరిధిలో వైకుంఠధామాల నిర్మాణానికి 50 వేల లోపు జనాభా ఉంటే ఎకరం స్థలంలో నిర్మాణానికి నిధులు రూ.కోటి, 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే ఎకరం స్థలంలో నిర్మాణానికి రెండు చోట్ల రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేయనున్నారు. లక్ష నుంచి మూడు లక్షల వరకు జనాభా ఉంటే మూడు ఎకరాల్లో రూ. మూడు కోట్లతో వైకుంఠధామాలను నిర్మించనున్నారు.
ప్రతిపాదనలు పంపిన అధికారులు.. త్వరల్లో టెండర్లు
పట్టణ నడిబొడ్డున ఎకరం నుంచి రెండు ఎకరాల స్థలం ఉంటేనే ఆయా చోట్ల సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థలాన్ని ఎంపిక చేసే కమిటీలో జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ కన్వీనర్గా, మున్సిపల్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ లెక్కన చూస్తే బాన్సువాడ పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 28 వేల జనాభా ఉండగా, ప్రస్తుతం అనధికారికంగా 50 వేలను దాటింది. ఇక్కడ రెండు ఎకరాల్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టణంలో అంత స్థలం లేదు. బాన్సువాడలోని పాత వారాంతపు సంతలో ఎకరం 5 గుంటల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ స్థలంలో ఒకవైపు మున్సిపల్ భవనానికి శంకుస్థాపన చేశారు. తాజాగా మిగిలిన ఎకరం స్థలంలో సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. దీని పక్కనే చేపల మార్కెట్ భవనం నిర్మిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ప్రస్తుతం పోలీస్ స్టేషన్రోడ్లో, అంబేద్కర్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ తదితర ప్రాంతాల్లో డైలీ మార్కెట్ కొనసాగుతున్నది. పట్టణ శివారులో నిర్మిస్తే ఇబ్బందులు తప్పవని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
కామారెడ్డి కేంద్రంలో 2011 ప్రకారం 1,04,213, జనాభా ఉంది. అనధికారికంగా లక్షా 20 వేల వరకు ఉండవచ్చని తెలుస్తున్నది. జనాభా ప్రాతిపదికన వ్యవసాయ మార్కెట్ గంజ్ ప్రాంతంలోని మూడు ఎకరాల్లో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 2011 ప్రకారం 19,750 మంది జనాభా ఉన్నారు. అనధికారికంగా 25 వేల వరకు ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బస్టాండ్ ఎదురుగా ఉన్న అటవీశాఖ, నీటిపారుదల శాఖ స్థలంలో నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం స్థల ప్రతిపాదనలు పంప డం పూర్తికాగా ఈ నెల 26 వరకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
ప్రతిపాదనలు పంపాం…
ప్రభుత్వం అందిస్తున్న నిధులతో బాన్సువాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం బాన్సువాడలోని వారాంతపు సంత స్థలం ఎకరం 5గుంటలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాం. ఈ నెల 26 వరకు టెండర్లు పూర్తయ్యే అవకాశం ఉంది. టెండర్లు పూర్తయిన వెంటనే రెండు కోట్ల రూపాయలతో సమీకృత మార్కెట్ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ప్రజలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాం.
-కళ్యాణం రమేశ్,మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ