సరిహద్దుల్లో ‘మహా’ దెబ్బ !
యథావిధిగా రాకపోకలు
కిటకిటలాడిన సాటాపూర్ సంత
వ్యాపారులకు పట్టని ‘మాస్క్, సోషల్ డిస్టెన్స్’
రెంజల్, ఏప్రిల్ 17 : పొరుగున ఉన్న మహారాష్ట్రలో చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. దీంతో మన ప్రభుత్వం అంతర్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో అక్కడి వారిని ప్రవేశించకుండా నిఘా ఏర్పాటు చేసి కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో కరోనా రూపంలో ముప్పు పొంచి ఉంది. రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల సమన్వయంతో నిరంతరంగా తనిఖీలు నిర్వహించేందుకు చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతుండడంతో అక్కడి అధికారులు ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను విధించినా తగ్గుముఖం పట్టడంలేదు. మన రాష్ట్ర సరిహద్దు గ్రామాల గుండా వచ్చి పోయే వారితో కరోనా విస్తరిస్తుండడంతో మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు మండలంలోని వీరన్నగుట్ట, పేపర్మిల్ గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాడ్బిలోలి గ్రామంలో ఈనెల 25వరకు స్వచ్ఛంద లాక్డౌన్కు గ్రామస్తులు ముందుకు వచ్చా రు. కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
తూతూ మంత్రంగా తనిఖీలు
కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల కందకుర్తి సరిహద్దు గుండా రాక పోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, మహారాష్ట్ర వైపు నుంచి బస్సులు, వాహనాల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చెక్పోస్టు వద్ద రాత్రి సమయంలో విధు లు నిర్వర్తించేందుకు సిబ్బంది ఆసక్తి చూపడంలేదు. సాటాపూర్ గ్రామంలో శనివారం జరిగిన వారాంతపు సంతలో కరోనా కట్టడిలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని పలు ముఖ్య పట్టణాలకు చెందిన వ్యాపారులు పెద్ద సంఖ్యలో రావడంతో స్థానికులు జంకుతున్నారు. కరోనా కేసులు పెరిగితే సంతను తాత్కాలికంగా రద్దు చేస్తామని ఇటీవల పోలీసులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో హెచ్చరించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.