స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను కోరిన మంత్రి ప్రశాంత్రెడ్డి
నేడు సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచన
బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండలాల్లో పర్యటించి కరోనా బాధితులను పలుకరించిన మంత్రి వేముల
లాక్డౌన్పై సమీక్ష, జ్వరసర్వే పరిశీలన
కొవిడ్ బాధితుల కోసం అవసరమైతే పాఠశాలలను ఐసొలేషన్ సెంటర్లుగా మార్చండి. జ్వర సర్వేను కొనసాగించాలి. కొవిడ్ నియంత్రణకు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. వారి పనితీరుపై ఎంతో విశ్వాసం ఉంది. వైద్యారోగ్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి.
అధికారులకు మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశం
వేల్పూర్, మే 15 : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలపై ఆర్థికభారం పడకుండా సీటీ స్కాన్కు రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. జిల్లాలోని ఇందూరు సీటీ స్కాన్ సెంటర్ యజమాని డాక్టర్ రవీందర్, ఆర్మూర్ అమృతలక్ష్మి సీటీ స్కాన్ సెంటర్ యజమాని డాక్టర్ ప్రకాశ్తోపాటు పలు స్కానింగ్ సెంటర్ల యజమానులతో మంత్రి శనివారం ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట, కరీంనగర్ తదితర జిల్లాలో సీటీ స్కాన్కు రూ.2వేలు తీసుకుంటున్నారని, జిల్లాలో సైతం అంతే తీసుకోవాలని కోరారు. కొవిడ్ బారినపడిన వారిలో వైరస్ తీవ్రతను అంచనా వేయడానికి సీటీ స్కాన్ తప్పనిసరి అయినందున పేదలపై ఆర్థిక భారం పడకుండా సహకరించాలని మంత్రి కోరారు. స్కానింగ్ సెంటర్ల యజమానులతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎంహెచ్వో బాలనరేంద్రతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రూ.2వేలకే సీటీ స్కాన్ చేసేలా యజమాన్యాలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.