రికవరీ రేటు బాగుంది
హోం ఐసొలేషన్లో ఉంటూనే కోలుకోవచ్చు
గుండె సంబంధిత వ్యాధులున్నా టీకా వేసుకోవచ్చు
కరోనాను గుర్తించడం, తక్షణం స్పందించడమే కీలకం
‘నమస్తే తెలంగాణ’ ఫోన్ఇన్లో డాక్టర్ జలగం తిరుపతి రావు
కరోనా అనుమానాల నివృత్తికి పెద్ద సంఖ్యలో ఫోన్లు చేసిన జనం
కరోనా సోకితే భయపడాల్సిన పనిలేదని ప్రముఖ జనరల్ ఫిజీషియన్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు స్పష్టంచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ప్రజలు వ్యక్తపరిచిన అనేక సందేహాలను ఆయన నివృత్తి చేశారు. కరోనా లక్షణాలను మొదట్లోనే గుర్తించడం, తక్షణం మందులు వాడడంతో అనేకమంది ఇంటివద్దే కోలుకుంటున్నారని చెప్పారు.
నిజామాబాద్, మే 8
(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరోనా సోకితే భయపడాల్సిన పని లేదని ప్రముఖ జనరల్ ఫిజీషియన్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.జలగం తిరుపతి రావు స్పష్టం చేశారు. లక్షణాలను మొదట్లోనే గుర్తించడం, తక్షణం మందులు వాడడంతో అనేక మంది ఇంటి వద్దే కోలుకుంటున్నారని చెప్పారు. కొవిడ్ సోకిన సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో ముప్పును కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. చిన్నపిల్లల్లో వైరస్ను ఎదుర్కొనే శక్తి ఉండడంతో ఇప్పటి వరకైతే సెకండ్ వేవ్ ప్రభావం అంతగా లేదని వివరించారు. “నమస్తే డాక్టర్” పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రిక నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఎంతో మంది తమ సందేహాలను ప్రశ్నల రూపంలో డాక్టర్ జలగం తిరుపతి రావును అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇందులో పలు ముఖ్యమైన ప్రశ్నలకు డాక్టర్ ఇచ్చిన సమాధానాలు మీ కోసం…
బీపీ, షుగర్ ఉన్నవారికి కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవిరి పట్టొచ్చా. కరోనా నుంచి కోలుకున్నాక ఇబ్బందులేమైనా ఉంటాయా?
మహమూదా, వినాయక్నగర్
డాక్టర్ : షుగర్, బీపీ ఉన్నవాళ్లు కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. షుగర్, బీపీ కంట్రోల్లో ఉండేలా జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ఒకవేళ కరోనా వస్తే స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ డోస్, వారు తీసుకునే మాత్రల డోస్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఆవిరి పట్టాలి. తదేకంగా ఆవిరి పట్టడంతో ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తాత్కాలిక ఉపశమనం కోసం ఆవిరి పట్టొచ్చు. వేడినీళ్లు కూడా అంతగా తాగకూడదు. కరోనా వచ్చిన తర్వాత నెల నుంచి రెండు నెలల వరకు ఇబ్బందులు ఉంటాయి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.
దవాఖానలకు వెళ్లిన కరోనా బాధితులు చనిపోతున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు బతుకుతున్నారు. దీనిపై క్లారిటీ కావాలి?
కృష్ణమూర్తి, భిక్కనూర్
డాక్టర్ : వందలో 92శాతం మందికి దవాఖాన అవసరం లేదు. కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరం ఏర్పడుతుంది. ఇందులోనూ 2 శాతం మంది మాత్రమే క్రిటికల్గా మారుతున్నారు. అందులో ఒకరిద్దరు ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స విధానాలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. చనిపోతున్న ఒకరో ఇద్దరితో మనం భయపడుతున్నాం. ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో చాలా మంది కరోనా సోకినప్పుడు నిర్లక్ష్యం వహించడమే కారణంగా కనిపిస్తోంది. ముందు జాగ్రత్తలు పాటిస్తున్న వారెవరూ చనిపోవడం లేదు.
రెండు, మూడు రోజులుగా మా భార్యకు తలనొప్పి ఉంది. గతంలోనూ వచ్చేది. ఆక్సిజన్ లెవెల్ 99 ఉంది. ఇతర లక్షణాలు లేవు?
సంతోష్, ఆర్మూర్
డాక్టర్ : తలనొప్పితో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్ లెవెల్ బాగానే ఉంది. ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే జాగ్రత్తపడాలి. తలనొప్పికి ఇంతకు మునుపు మీరు సంప్రదించిన డాక్టర్ను మరోసారి సంప్రదించండి. వైద్యుల సలహా మేరకు చికిత్స చర్యలు పాటించండి. దమ్ము, దగ్గు వస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి.
మాస్కు వేసుకుంటే కరోనా రాదని చెబుతున్నారు. రోగి మన దగ్గర్లో ఉన్నప్పుడు గాలి పీల్చుకున్న సమయంలో కరోనా వస్తుందా?
శ్రీనివాస్, కంఠేశ్వర్
డాక్టర్ : కరోనా వచ్చిన వ్యక్తితోపాటుగా మనం కూడా మాస్కు పెట్టుకొని ఉంటే దాదాపుగా రిస్క్ ఉండదు. కొవిడ్ సోకిన వారితో దూరాన్ని పాటించాలి. అవతలి వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎక్కువ శాతం కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మాస్క్ తప్పక రక్షిస్తుంది. మాస్కు లేకుండా బయటికి రావొద్దు.
నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చికిత్స పూర్తి చేసుకొని కోలుకున్నాను. మళ్లీ టెస్టు చేయించుకోవాలా?
శ్రీకాంత్, కామారెడ్డి
డాక్టర్ : కరోనా సోకిన తర్వాత కోలుకున్న వారు తిరిగి టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఇచ్చిన మందులు పూర్తిగా వాడిన తర్వాత ఎలాంటి లక్షణాలు లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. ఐసొలేషన్లో 14 రోజుల సమయం చాలా ముఖ్యమైన విషయం. కరోనా లక్షణాలు ఏవీ లేనప్పుడు మరోమారు టెస్టు చేయించుకోవడం ఈ సమయంలో అనవసరం.
మా బాబుకు 18 సంవత్సరాలు. చేపలు, రొయ్యలు తింటే నోటిలో వాపు వస్తుంది. వ్యాక్సిన్ ఇప్పించొచ్చా?
అనురాధ, నిజామాబాద్
డాక్టర్ : చిన్నపాటి అలర్జీలు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చని సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ వారు ప్రకటించారు. అయితే, వైద్యుల పర్యవేక్షణలోనే వ్యాక్సిన్ ఇప్పించండి. భారీ అలర్జీలు ఉంటే మాత్రం వ్యాక్సిన్ తీసుకోకూడదు.
నేను టీకా మొదటి డోస్ వేసుకున్నా. ప్రస్తుతం కరోనాతో హోం ఐసొలేషన్లో ఉన్నాను. రెండో డోసు వేసుకోవచ్చా?
విజయ్ కుమార్, కామారెడ్డి
డాక్టర్ : టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు రెండో డోసు తీసుకోవడంలో ఇబ్బంది లేదు. కాకపోతే నెగెటివ్ వచ్చిన తర్వాత 14 రోజుల అనంతరమే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
మా బాబుకు కరోనా వచ్చి 15 రోజులైంది. మిగిలిన కుటుంబ సభ్యులంతా టెస్టు చేయించుకోవాలా?
గంగాధర్, నిజామాబాద్
డాక్టర్ : కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే మిగిలిన వారు జాగ్రత్తగా ఉండాలి. మీలో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే టెస్టు చేయించుకోవాలి. రెండు వారాలు దాటినందున లక్షణాలుంటే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
కరోనా వచ్చి పోయింది. ఛాతిలో నొప్పి వస్తుండడంతో భయమేస్తుంది. ఏం చేయాలి?
-తిరుపతి, కామారెడ్డి
డాక్టర్ : కరోనా వచ్చి కోలుకున్న వాళ్లలో చాలా మందికి నెలన్నర రోజులపాటు చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆందోళనకు గురికావొద్దు. ప్రశాంతంగా ఉండండి. ఇంటి వద్దే మంచి ఆహారం తీసుకుంటూ జాగ్రత్త వహించండి. ఎక్కువ వ్యాయామం చేయడం, శారీరక శ్రమకు గురవ్వకూడదు. ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి.
వారం క్రితం కరోనా వచ్చింది. మందులు వాడుతున్నాను. జ్వరం వచ్చి తగ్గింది. మళ్లీ ఎక్కువవుతుంది?
సరస్వతి, నిజామాబాద్
డాక్టర్ : పల్స్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. జ్వరం హెచ్చుతగ్గులు అవుతున్న నేపథ్యంలో సీబీపీ, సీఆర్పీ పరీక్ష చేయించుకోండి. ఈ రెండు టెస్టు ఫలితాలతో మీ దగ్గర్లోని ఫిజీషియన్ను సంప్రదించండి. భయపడాల్సిన అవసరం లేదు.
నాకు, నా భార్యకు కొవిడ్ వచ్చి తగ్గిపోయింది. ప్రస్తుతం దగ్గు వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి?
జగన్, నిజామాబాద్
డాక్టర్ : కొద్దిమందిలో కరోనా వచ్చి తగ్గిపోయినప్పటికీ దగ్గు కొనసాగుతోంది. సరైన మందులు వాడితే తగ్గుతుంది. ఆవిరి పట్టొద్దు.
వ్యాక్సిన్ తీసుకొని 16 రోజులైంది. ఒళ్లు నొప్పులు, జలుబు ఉంది. నెల రోజుల క్రితం కొవిడ్ టెస్టు చేయించాను. ఇప్పుడు చేయించాలా?
-రవి, బిచ్కుంద
డాక్టర్ : వ్యాక్సిన్ ద్వారా ఏవైనా లక్షణాలు వస్తే రెండు, మూడు రోజుల్లోపే ఉంటుంది. ఆ తర్వాత వస్తే వ్యాక్సిన్కు సంబంధం లేదు. మీరు చెబుతున్న లక్షణాల్లో కరోనాకు సంబంధించినవి ఉన్నాయి. మీరు తక్షణం టెస్టు చేయించుకోండి. నెగెటివ్ వచ్చినప్పటికీ మందులు వాడటం మంచిది.
మా అమ్మకు 66 సంవత్సరాలు. 10 రోజుల నుంచి గొంతు నొప్పి ఉంది. ముక్కు పట్టేసినట్లుంది. టెస్టులో నెగెటివ్ వచ్చింది. పది రోజుల క్రితం మా నాన్నకు కరోనా వచ్చి తగ్గిపోయింది?
కిరణ్, ముబారక్నగర్
డాక్టర్ : మీ అమ్మకు కొవిడ్కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. పూర్తిస్థాయి లో మందులు వాడాలి. నిర్లక్ష్యం చేయొద్దు. టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ కరోనా ట్రీట్మెంట్ వాడితే బెస్ట్. కొవిడ్ మాదిరిగానే భావించి జాగ్రత్తలు పాటించండి.
నాకు నెల రోజుల క్రితం కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు మలబద్దకం సమస్య వస్తోంది?
సురేఖ, బోధన్
డాక్టర్ : వేసవికాలం మూలంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కరో నా వచ్చి తగ్గింది కాబట్టి ఎలాంటి భయం వద్దు. డల్కోఫెక్స్ టాబ్లెట్ వేసుకోవాలి. దీంతోపాటుగా నీరు ఎక్కువగా తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా స్వీకరించాలి.
కరోనా వచ్చి 15 రోజులైంది. రెండు రోజులుగా దగ్గు వస్తుంది. ఆక్సిజన్ స్థాయి బాగుంది. దమ్ము ఎక్కువవుతుంది?
రాజేశ్వర్, ఆర్మూర్
డాక్టర్ : కరోనా చికిత్సలో భాగంగా మీరు స్టెరాయిడ్ మందులు తీసుకుని ఉంటే ప్రాబ్లమ్ లేదు. కరోనా వచ్చిన తర్వాత చిన్నపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. మరోసారి టెస్టు చేయించుకోవడం అనవసరం. మీ దగ్గర్లో ఫిజీషియన్ను వెంటనే సంప్రదించండి. ఆక్సిజన్ స్థాయి బాగుంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
నా వయస్సు 86. ఈసీజీ తీస్తే గుండె ప్రాబ్లమ్ వచ్చింది. మందులు వాడుతున్నాను. నేను కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
డాక్టర్ : తప్పకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మొన్ననే పలు వ్యాధులతో బాధపడుతోన్న 80 ఏండ్ల వృద్ధురాలికి టీకా ఇప్పించాము. ఆమెకు క్యాన్సర్తోపాటు గుండె, ఇతర సమస్యలున్నాయి. మీరు కూడా నిరభ్యంతరంగా టీకా వేయించుకోవాలి. టీకా కేంద్రానికి వెళ్లినప్పుడు మాస్కు ధరించండి. ఎక్కడా మాస్కును తీయకండి.