బాల్కొండ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోతే, అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మోతె గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగు పారడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చెరువు అలుగు వద్ద పూజలు చేసి మంత్రి మాట్లాడారు. మోతె గ్రామంలో సాగునీటికి సమస్య ఉండేదని సీఎం సహాయ నిధి నుంచి మాటు కాలువకు రూ. 3 కోట్ల 80 లక్షలు మంజూరు చేసి పనులు పూర్తి చేయడం ద్వారా 30 ఏండ్ల తర్వాత చెరువు నిండిందన్నారు. సాగునీటికి గోస పడ్డ మోతె నేడు జలకలతో మురిసిపోతుందన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం నింపిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ముచ్కూర్లో తెగిపోయిన చెరువు కట్టకు వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ. 93 లక్షల వ్యయంతో భీమ్గల్ మండలంలోని ముచ్కూర్, నీలపల్లి చెరువుల కట్టల పునరుద్ధరణ పనుల జరుగుతుండగా వరదలకు కట్టలు తెగిపోయాయి. 150 ఎకరాల్లో పంట నీటమునిగి ఇసుక, మట్టి మేట వేసి రైతులు నష్టపోయారు. నష్టాన్ని అంచనా వేయాలని తాసిల్దారు, వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు.
‘మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టులో 85 టీఎంసీలను బ్యాలెన్స్ చేస్తూ అధికారులు దిగువకు 2 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నాం’ అని మంతి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.