ఇందూరుః ఈనెల 19న జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శోభాయాత్ర ప్రారంభమయ్యే దుబ్బ ప్రాంతం నుంచి నిమజ్జన స్థలం వరకు ఉన్న మార్గాలను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ విగ్రహాలను క్రమపద్ధతిలో , పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని ఆయన తెలిపారు. వినాయక్నగర్లోని గణేశ్ బావి దగ్గర నిమజ్జనానికి 3 నుంచి 4 ఫీట్లు ఉన్న విగ్రహాలను మాత్రమే తీసుకురావాలని, మిగతా వాటికి ఇతర చోట్ల పాయింట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లాలోని 220 వరకు గణేశ్ నిమజ్జనం పాయింట్లు ఉన్నాయని, అన్ని ప్రాంతాలకు అక్కడి లోకల్ బాడీ గ్రామపంచాయతీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
సీపీ కార్తికేయ మాట్లాడుతూ పోలీస్లు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని, నిమజ్జనం సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశామని వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఏసీపీ శ్రీనివాస్, గణేశ్ మండలి అధ్యక్షులు బంటు గణేశ్, ఆర్డీవో రవి, ఆర్అండ్బీ, విద్యుత్ ఇంజినీర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.