ఎడపల్లి, జనవరి21: మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శనివారం మౌని అమావాస్య కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి నెలకొంది. అష్టముఖి కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకొన్నారు. అష్టముఖి కోనేరు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్య సౌకర్యాలతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎడపల్లి, రెంజల్, నిజామాబాద్ పోలీసు సిబ్బంది సేవలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వేణు, ఆలయ చైర్మన్ పురం సాయిలు పర్యవేక్షించారు. సుమారు 40వేల నుంచి 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుప్రియ దర్శించినట్టు ఆలయ ఈవో వేణు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు, ప్రధాన అర్చకులు కొండమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సంతాయిపేట శ్రీభీమేశ్వరాలయం ప్రాంతం శనివారం అమావాస్య సందర్భంగా భక్తజనంతో కిక్కిరిసి పోయింది.