కోటపాటి నర్సింహానాయుడు
ఆర్మూర్, జూలై 19 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుని.. ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలను కోరిందన్నారు.
ఈ సందర్భంలో గత నవంబర్ నెలలో ఒక కమిటీని వేసిందని చెప్పారు. రైతు సంఘాల సూచనల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. సంవత్సరం పాటు కాలయాపన చేసిన కేంద్రం తమకు అనుకూల సంఘాల నుంచి 26 మందిని నియమించి కేవలం ముగ్గురిని మాత్రమే సంయుక్త కిసాన్ మోర్చా నుంచి తీసుకోవడానికి పేర్లు ఇవ్వాలని కోరిందని తెలిపారు. ఏడాది కాలయాపన చేసి ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఈ కమిటీలోకి రైతు ప్రతినిధులను పంపకూడదని అఖిల భారత రైతు సంఘాలు నిర్ణయించినట్లు కోటపాటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ భజనపరులతో కూడిన సభ్యులను తొలగించి కొత్తగా సంయుక్త కిసాన్మోర్చా ప్రతినిధులను ఎక్కువ సంఖ్యలో తీసుకుని ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సం ఘం ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు నక్కల చిన్నారెడ్డి, రైతు నాయకుడు కుంట గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు.