మెండోరా, అక్టోబర్ 4 : గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఇందులో ఒకరు అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా ఒకరు గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లా గాంధీనగర్ గ్రామానికి చెందిన సాలుకే మరియప్ప, తండ్రి సాలుకే బాబు మంగళవారం గోదావరి నదిలో చేపలు పడుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. నిర్మల్ జిల్లా సోన్ మండల పరిధిలో సంఘటన చోటు చేసుకున్నది. మరియప్ప అతికష్టం మీద ఈదుకుంటూ బయటికి వచ్చాడు. తండ్రి బాబు నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాడు. గల్లంతైన బాబు కోసం జాలర్లు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో ఇద్దరు జాలర్లు గల్లంతైన విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరదగేట్లు, గోదావరి గేట్లను మూసివేశారు.