నిజామాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరిగే పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ ప్రాంత బిడ్డల సంప్రదాయాలకు అడుగడుగునా వివక్ష ఉండేది. ఆడబిడ్డలు ఆడి పాడుకునే పూల పండుగ బతుకమ్మపైనా సమైక్య పాలనలో నిర్లక్ష్యం చూపారు. పరమత సహనం అన్నది మచ్చుకూ పాటించలేదు. ప్రజల మధ్య ఉన్న ఐక్యతనే గంగా జమునా తహజీబ్ అన్నట్లుగా వర్ధిల్లేది. సమైక్య పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన అనంతరం 2014 నుంచి నేటి వరకు మతాలకు, కులాలకు అతీతంగా సంప్రదాయాలకు, సాంస్కృతిక వైభవానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనికతతో సర్వ మతస్తులకు ప్రభుత్వం నుంచి కానుకలు అందిస్తుండడం యావత్ దేశంలోనే ఎక్కడా లేదు. రంజాన్, క్రిస్మస్, దసరా పండుగకు ముందు వచ్చే బతుకమ్మకు కానుకలను ప్రభుత్వమే పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. దీంతోపాటు ప్రభుత్వ నిధులతోనే గణనీయమైన ఏర్పాట్ల మధ్య సర్వ మతస్తుల ఆచార, సంప్రదాయాల మధ్య పండుగలను వైభవంగా నిర్వహించడం తెలంగాణ సర్కారు గొప్పతనానికి నిదర్శనం.
సాంస్కృతిక గౌరవం..
ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి పూర్తిగా బయటపడి సొంత రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ పండుగలు జోర్దార్గా సాగుతున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ యాస, సంస్కృతిని అవహేళన చేసినవారికి మనమేంటో చూపేలా కార్యాచరణతో పని చేస్తున్నారు. మన సంస్కృతికి అద్దంపడుతూ వందల ఏండ్లుగా కొనసాగుతున్న బోనాలు, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. ఇన్నాళ్లూ ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేసిన ఈ పండుగలను సాంస్కృతిక గౌరవంతో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రకృతిని దేవతలుగా కొలుచుకునే ఎన్నో పండుగలకు ప్రభుత్వం దండిగా నిధులు కేటాయిస్తూ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నది. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ మహిళలు జరుపుకొనే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. అందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో బతుకమ్మ పండుగ, నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది.
బతుకమ్మను నిలబెట్టిన జాగృతి..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనసభ్యురాలు కల్వకుంట్ల కవిత కృషి ఫలితంగానే దేశ విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పక తప్పదు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుండి నడిపిన కవిత.. ప్రధానంగా బతుకమ్మ ఆటపాటలతోనే మహిళలను ఒక్క చోటుకు చేర్చారు. ఆడబిడ్డల్లోనూ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని బలంగా నాటారు. అంతేకాకుండా వాడవాడలా బతుకమ్మను ఆడే విధంగా నేటితరం యువతులను ప్రోత్సహించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో కలియ తిరుగుతూ ఆడపడుచులతో కలిసి కవిత బతుకమ్మ ఆడి పాడుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.అలనాటి పల్లెటూరి జానపదాలు, గేయాలను క్రోడీకరించి డిజిటలీకరణం చేయించారు. సరికొత్త రీతుల్లో బాణీలు సమకూర్చి క్యాసెట్లు, సీడీల రూపంలో ప్రజలకు అందించి బతుకమ్మకు జీవం పోశారు. గతేడాది దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను నిలబెట్టి ప్రపంచ వ్యాపితం చేశారు.
ప్రభుత్వ కానుక..
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా చీరెలు ఇచ్చే ఆనవాయితీని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ఏటా ఓ సంప్రదాయంగా కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కారు.. ఈ ఏడాది కూడా ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేసింది. సుమారు 8 లక్షల మంది మహిళలకు వందల వెరైటీల్లో చీరెలను అందజేస్తున్నారు. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద వర్గాల వారికి దుస్తుల పంపిణీ చేపట్టి తెలంగాణ ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తెచ్చింది. ప్రధాన పండుగలను ప్రభుత్వమే ప్రజల మధ్య నిర్వహిస్తూ సోదరభావం వెల్లివిరిసేలా కృషి చేస్తున్నది. తెలంగాణకు ప్రత్యేకమైన బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. కేసీఆర్ సర్కారు పనితీరు మత సామరస్యానికి అద్దం పడుతున్నాయి. తెలంగాణ భాష, సాంస్కృతిక కీర్తిని ప్రపంచమంతా చాటిచెప్పేందుకు పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కుతున్నది. క్రిస్మస్ను పురస్కరించుకొని క్రైస్తవులకు చిరు కానుకలకు ప్రభుత్వం పంపిస్తున్నది. ఓ ప్యాంటు, షర్టుకు సరిపడా క్లాత్, ఒక చీరె, పంజాబీ డ్రెస్ మెటీరియల్తో గిఫ్ట్ప్యాకులు పంపిణీ చేస్తున్నది. రంజాన్కు సైతం ముస్లిములకు తోఫా అందిస్తూ సర్వ మతాలను సమ ప్రాధాన్యతతో గౌరవిస్తుండడం విశేషం.
దేశంలో మరెక్కడా లేదు..
సర్వ మతాలకు సమప్రాధాన్యం ఇవ్వడం లో తెలంగాణ రాష్ర్టాన్ని మించినది ఇంకో టి లేదు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇంత లా కృషి చేయలేదు. బతుకమ్మ, రంజాన్ పండుగలకు కానుకలను అందించినట్లే క్రిస్మస్కు సైతం ప్రజలకు గిఫ్ట్లను పంపి ణీ చేయడం సంప్రదాయంగా మారింది. సీఎం కేసీఆర్ ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే ఇది చూస్తున్నాం.
– రాజేశ్వర్ రావు, ఎమ్మెల్సీ
సుపరిపాలనకు నిదర్శనం…
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాతే మన పండుగలకు విశేషమైన ఖ్యాతి దక్కుతున్నది. సర్వమతాలకు సమ ప్రాధా న్యం కల్పిస్తూ సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారు. మన సంప్రదాయాలను సమైక్య పాలకులు పట్టించుకోకపోవడంతో మరుగున పడ్డాయి. నిర్లక్ష్యానికి గురైన మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ సర్కారు తోడ్పాటుతో మేలు జరుగుతున్నది. భావితరాలకు అమూల్యమైన సంప్రదాయాలను అందించేందుకు ప్రభుత్వం పాటుపడుతున్నది.
– మారయ్య గౌడ్, విద్యావేత్త