ఖలీల్వాడి సెప్టెంబర్ 25 : ప్రైవేటు దవాఖానలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నార్మల్ డెలివరీల కన్నా సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండ డంతో గతంలోనే నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రైవేటు దవాఖానల్లో వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 53 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. అయినా తీర్చు మార్చుకోలేదు. ఆగస్టు నెలలో మొత్తం 962 ప్రసవాల్లో సాధారణం 103 అయితే సిజేరియన్లు 859 చేశారు. ప్రైవేటు దవాఖానల యజమానులు కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సిజేరియన్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారితో మాట్లాడి వెంటనే ప్రైవేటు దవాఖానల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడంలేదని 8 బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్లో 5, బోధన్లో ఒకటి, ఆర్మూర్లో 2 బృందాలను తనిఖీ చేయడానికి నియమించారు. ఇప్పటివరకు మొత్తం 75 దవాఖానలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్నా వారిలో మార్పు రావడం లేదు. మళ్లీ అడ్డూఅదుపు లేకుండా అదే పనిగా మళ్లీ సీజేరియన్లు చేస్తున్నారు.
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు నామమాత్రంగా నోటీసులు జారీ చేయడంతో పాటు వారికి అన్ని విధాలుగా అండగా నిలవడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అడ్డగోలు బిల్లులు వేసి ప్రజలను దోచుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళ ప్రసవానికి దవాఖానకు వచ్చిదంటే చాలు సాధారణ డెలివరీ అయితే మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారు. కానీ సిజేరియన్లు చేస్తే వారం నుంచి 10 రోజులు దవాఖానలో ఉంచి లక్షల్లో బిల్లులు వేసి పబ్బం గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోక పోవడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పని తీరుకు అద్దం పడుతుంది. కలెక్టర్ ఆదేశాలు ఇస్తే తప్ప వారికి సోయి రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా దవాఖానలకు పర్మిషన్లు ఇస్తూ వాటి భద్రతను గాలికి వదిలేశారు. నిజామాబాద్, బోధన్, భీమ్గల్, ఆర్మూర్ సుమారు 160 దవాఖానలు ఉన్నాయి. కనీస నింబధనలను పాటించకుండా.. గర్భిణులకు సాధారణ డెలివరీలు చేయకుండా రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు గుంజుతున్నారు. ఆగస్టు నెలలో 89 శాతం సిజేరియన్లు జరగడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
కలెక్టర్ సీరియస్
ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్లపై కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక నిఘా పెట్టారు. గతంలోనూ 53 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. మళ్లీ 75 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. 8 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించేదిలేదని తేల్చి చెప్పారు.
పకడ్బందీగా తనిఖీలు
జిల్లాలోని ప్రైవేటు దవాఖానల్లో తనిఖీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ప్రసూతి వైద్యశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం. తనిఖీ బృందాలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎక్కువగా సిజేరియన్లు చేసిన దవాఖానలకు నోటీసులు జారీ చేసి కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం.
-సుదర్శనం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిజామాబాద్