విద్యానగర్, ఆగస్టు 24 : కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, గైర్హాజరు కావడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. డుమ్మా కొట్టి సొంతపనులు, వ్యాపారాలు చక్కబెట్టుకునే ఉపాధ్యాయులకు చెక్ పెట్టేందుకు 2017లోనే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండేండ్లుగా ఈ విధానాన్ని నిలిపివేశారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి బయోమెట్రిక్ హాజరును సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బయోమెట్రిక్ విధానాన్ని 2019లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిపివేయగా, తిరిగి అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బయోమెట్రిక్ యంత్రాల సంఖ్య, వాటి పనితీరుపై పూర్తి సమాచారాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. టెక్నీషియన్లు పాఠశాలల్లో ఉన్న బయోమెట్రిక్ మిషన్లను పరిశీలిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో 1002 పాఠశాలల్లో అమలు..
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 187 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 127 ప్రాథమికోన్నత పాఠశాలలు, 694 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 1,031 పాఠశాలలు ఉండగా, అందులో 1,002 బడుల్లో ఉపాధ్యాయుల హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రార్థనకు ముందే రావాలి..
బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యే సమయం ఉన్నతాధికారులకు వెంటనే తెలిసిపోతుంది. దీంతో తప్పనిసరిగా ప్రార్థనా సమయానికి ముందే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. హైస్కూల్లో ఉదయం 9.35కు ముందు హాజరై, సాయంత్రం 4.45 తర్వాతనే పాఠశాలను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు విధుల్లో ఉండాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిపివేసిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డుమ్మా కొడితే దొరికిపోతారు..
బయోమెట్రిక్ హాజరు విధానంతో ఉపాధ్యాయులు విధులకు డుమ్మాకొడితే వెంటనే దొరికిపోతారు. కరోనా వ్యాప్తి కారణంగా రిజిస్టర్లను ఏర్పాటుచేసి మ్యాన్యువల్గా హాజరు వేస్తున్నారు. ఉపాధ్యాయుడు రిజిస్టర్లో సంతకం చేస్తే విధులకు హాజరైనట్లుగా పరిగణిస్తారు. కానీ కొందరు ప్రధానోపాధ్యాయులను మచ్చిక చేసుకొని సొంతపనులు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. పాఠశాలకు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడంతో సమయానికి సిలబస్ పూర్తిచేయడం లేదు. దీంతో విద్యార్థుల చదువుపై చాలా ప్రభావం చూపుతున్నది. కొందరైతే రెండు మూడు రోజులపాటు డుమ్మా కొట్టి, ఆ తర్వాత విధులకు హాజరైనట్లుగా రిజిస్టర్లలో సంతకాలు పెడుతున్నారు. మారుమూల గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు స్థానిక మండల కేంద్రాల్లో కాకుండా దూర ప్రాంతాలనుంచి తమకు వీలైనప్పుడు పాఠశాలకు వచ్చిపోతుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా తమ హాజరును బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
పకడ్బందీగా అమలు చేస్తాం..
కరోనాకు ముందు బయోమెట్రిక్ హాజరు అమలులో ఉండే ది. 2019 నుంచి ఈ విధానాన్ని నిలిపివేశాం. కొవిడ్ కేసుల సంఖ్య తగ్గడంతో బయోమెట్రిక్ తిరిగి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో టెక్నిషియన్లు యంత్రాలను పరిశీలించారు. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాల్సిందే.
-గంగాకిషన్, ప్లానింగ్ కో-ఆర్డినేటర్, సమగ్ర శిక్ష అభియాన్