నిజామాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ఎక్స్రోడ్డులో బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది. నిజాలు దాచి పెట్టి అబద్ధాలతో రెండున్నర గంటల పాటు ప్రజలు, రైతులను బీజేపీ నేతలు వంచించారు. పసుపు బోర్డు హామీ, దానికి సంబంధించిన పూర్వాపరాలు తెలియని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడి గతం మాదిరిగానే తన పరువును తానే తీసుకున్నాడు. ఈయనకు జోడిగా స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ మరింతగా ఆజ్యం పోస్తూ స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీసే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడాడు. వాస్తవానికి బాండ్ పేపర్పై పసుపు బోర్డు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పిస్తానంటూ అర్వింద్ స్వయంగా రాసిచ్చాడు. ఇదంతా వాస్తవమే అయినప్పటికీ ధర్నాలో బీజేపీ ప్రజాప్రతినిధులు మాత్రం బాండ్ పేపర్ ఊసెత్తక పోవడం గమనార్హం. బాండ్ పేపర్లో రాసింది తప్పా ఒప్పా అన్న సంగతిని ఎక్కడా ప్రస్తావించలేదు. స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటరే పసుపు రైతులకు మేలు చేకూర్చేది అయితే ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని రైతులకు బీజేపీ నేతలు ఎందుకు చెప్పలేదు? అన్నది జవాబు లేని ప్రశ్నగా మారింది.
జిల్లాలో అత్యధికంగా పసుపు సాగురాష్ట్రంలో పసుపు పంటకు పెట్టింది పేరు నిజామాబాద్ జిల్లా. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో సాగయ్యే పసుపు పంటకు డిమాండ్ దక్కాలంటే పసుపు బోర్డు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. రైతులకు సాగులో మెళకువలు, శాస్త్రీయబద్ధమైన సలహాలు, సూచనలతో పాటుగా కొత్త వంగడాల సృష్టి వంటివన్నీ బోర్డు ద్వారానే సాధ్యమవుతాయి. పసుపు రైతులకు ఎలాంటి విపత్తు సంభవించినా పసుపు బోర్డు ద్వారా కష్టాలు తీరే వీలు దక్కుతుంది. అందుకే దశాబ్దాలుగా ఇందూరు రైతులు ఈ డిమాండ్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పసుపు అత్యధికంగా పండించే ప్రాంతంలో పసుపు బోర్డు మాత్రమే కావాలంటూ రైతులు చెబుతున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం స్సైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయంతో మేలు జరుగుతుందంటూ చెప్పుకుంటుండడం సిగ్గుచేటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పైసెస్ బోర్డు అన్నది సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది. స్పైసెస్ బోర్డు చేసే పనులు వేరంటూ రైతులు అంటున్నారు. పసుపునకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటైతే తప్ప పసుపు రైతులకు మేలు జరగదని చెబుతున్నారు.
మద్దతు ధరపై అబద్దాలు
వేల్పూర్ ఎక్స్ రోడ్డు ధర్నాలో అర్వింద్, రఘునందన్ రావు చెప్పిన మాటల్లో పసుపునకు మద్దతు ధర అంశం రైతులకు ఆగ్రహం తెప్పిస్తోంది. రికార్డు స్థాయిలో కనీస మద్దతు ధర దక్కిందనడం శుద్ధ తప్పంటూ జిల్లా రైతులు చెబుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఒకరిద్దరికి మాత్రమే వచ్చిన గరిష్ఠ మద్దతు ధరను తన ఘనతగా చెప్పుకుంటుండడంపై మండిపడుతున్నా రు. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్గా ఇప్పటికే రైతులంతా భావిస్తున్నారు. రైతుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోలేక బీజేపీ అనుకూల వ్యక్తులతో వ్యవసాయ మార్కెట్లో ఎంపీ అర్వింద్ ఆడిస్తోన్న రాజకీయ క్రీడగానే సామాన్య రైతులు అభివర్ణిస్తున్నారు. గత సీజన్లోనే అత్యల్పంగా క్వింటా పసుపు 4,450 రూపాయలకు అమ్ముడు పోతే కనీసం ఎంపీ అర్వింద్ పట్టించుకోలేదని గుర్తు చేసుకుంటున్నారు. కేవలం ఒకరిద్దరికి మాత్రమే వచ్చిన ధరను పదే పదే ప్రచారం చేసుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటంటూ కర్షకులు ప్రశ్నిస్తున్నారు. రైతులను రాజకీయ వస్తువుగా బీజేపీ వాడుకోవడం తగదంటూ ఆయా వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ హోదాలో కవిత కృషి
నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో రైతులు ఎక్కువగా పసుపు పంటనే సాగు చేస్తుంటారు. దాదాపుగా ఐదున్నర దశాబ్దాలుగా సాగవుతున్న ఇక్కడి పంటకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే నిజామాబాద్ పసుపు పంటను ఆయా ఉత్పత్తులు, ఔషధాల్లోనూ వాడుతుంటారు. డిమాండ్ ఉన్న ఈ పంటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం 2014 నుంచి 2019 వరకు ఎంపీ హోదాలో కల్వకుంట్ల కవిత తీవ్రంగా కృషి చేశారు. 2017లో వాణిజ్య మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ స్వయంగా స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ ప్రకటిస్తే కవిత తిరస్కరించారు. పసుపు బోర్డు తప్ప మిగతాదేది తమ రైతులకు ప్రత్యామ్నాయం కాబోదని కుండబద్దలు కొట్టారు. ప్రధానమంత్రిని పలుమార్లు కలిసి బోర్డు ఏర్పాటుపై ఉద్యమం చేశారు. కవిత చేసిన ఉద్యమానికి స్పందించిన కేంద్రమే ఒక మెట్టు దిగి ఎక్స్టెన్షన్ సెంటర్ పేరిట ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడదే ఆఫీసును పట్టుకొచ్చిన ఎంపీ అర్వింద్ ఇదంతా తన ఘనకార్యమంటూ చెప్పుకోవడం సిగ్గు చేటంటూ రైతులు మండిపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీగా ఉన్న అర్వింద్ చేతగాని తనానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం మరోటి లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుభవం లేనివారు మాట్లాడుతున్నారు
వేల్పూర్ ఎక్స్రోడ్డులో బీజేపీ నిర్వహించిన ధర్నాలో వ్యవసాయంపై అనుభవం లేనివారు మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుకు ఎర్రజొన్న, తెల్లజొన్నలు ఉంటాయని, కానీ పచ్చజొన్నలంటూ మాట్లాడడం హాస్యాస్పదం. రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నామని గొప్పలు చెబుతున్న నాయకులకు అన్నదాతలు పండించే పంటలపై ఎటువంటి అవగాహన లేకపోవడం శోచనీయం. ఇలాంటి వారు రైతుల కోసం ఏం చేస్తారనేది అనుమానమే.
– బోదపల్లి సురేశ్కుమార్, కుకునూర్
గంజాయి సాగు చేస్తున్నారనడం తప్పు
బీజేపీ చేపట్టిన ధర్నాలో కొందరు నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని రైతులు గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపణలు చేయడం సరికాదు. రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తే గంజాయి సాగు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం బాధాకరం. రైతులు ఎక్కడ గంజాయి సాగు చేస్తున్నారో వారు వచ్చి నిరూపించాలి.
– బద్దం రాజేశ్వర్, కమ్మర్పల్లి
రైతులను మోసం చేసి..
రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్ రైతుల కోసం ధర్నా చేయడం అర్థం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులకు హామీ ఇచ్చి ఎంపీగా గెలిచిన అర్వింద్ బోర్డు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. బోర్డు ఏర్పాటు అయితే మా సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి అర్వింద్ను గెలిపించుకున్నాం. మమ్ములను మోసం చేసిన ఆయనను గ్రామాలకు రానివ్వం.
-సింగిరెడ్డి రాజేశ్వర్, దొన్కల్, మోర్తాడ్
రాష్ట్ర ప్రభుత్వంతోనే రైతులకు మేలు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం గోదాములను ఏర్పాటు చేసింది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారు.
-పర్స దేవన్న, మోర్తాడ్