ఖలీల్వాడీ(మోపాల్), ఆగస్టు 12 : రాఖీపండుగ రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకున్నది. పెండ్లి చేయడం లేదని కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన ఓ యువకుడు.. శుక్రవారం తండ్రి, బాబాయ్లను దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాల వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు సైతం చేయడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మోపాల్ మండల కేంద్రానికి చెందిన కర్రల పెద్ద అబ్బయ్య (64), లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మోహన్, చిన్నకుమారుడు శోభన్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. నడిపి కుమారుడు సతీశ్ గతంలో గల్ఫ్కు వెళ్లగా, అక్కడే మతిస్థిమితం కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇండియాకు రప్పించి చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. అప్పటి నుంచి ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతున్న సతీశ్ తనకు పెండ్లి చేయాలని కుటుంబ సభ్యులను వేధించేవాడు. అయితే, అతడి మానసిక స్థితి తెలిసిన కుటుంబ సభ్యులు నిరాకరిస్తూ వచ్చారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు నచ్చజెప్పినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి.
గురువారం రాత్రి కూడా ఇంట్లో గొడవ పడినట్లు తెలిసింది. తానే పెండ్లి సంబంధం కుదుర్చుకున్నానని, అమ్మాయి తరఫు వాళ్లు ఆదివారం వస్తారని చెప్పడంతో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కూడా మరోసారి గొడవ మొదలైంది. ఆగ్రహానికి గురైన సతీశ్ తండ్రి అబ్బయ్యను కొట్టడానికి వెళ్లగా, అక్కడే ఉన్న బాబాయ్ కర్రల నడిపి సాయిలు (54) అడ్డుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న కర్రతో బాబాయ్ని బలంగా కొట్టాడు. అది విరిగి పోవడంతో దగ్గరలో ఉన్న పార తీసుకుని తలపై మోదడంతో సాయిలు కుప్పకూలి పోయాడు. ఇది చూసిన అబ్బయ్య తమ్ముడి వద్దకు వెళ్తుండగా సతీశ్ అతడిని కూడా చావబాదాడు. ఇద్దరినీ మళ్లీ కొట్టి చనిపోయారని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఏసీపీ వెంకటేశ్వర్, రూరల్ సౌత్ సీఐ నరేశ్, ఎస్సై మహేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సతీశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. తండ్రి, బాబాయ్లను హతమార్చిన అనంతరం సతీశ్ అక్కడే కొబ్బరికాయ కొట్టి పూజలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.