ఇందూరు, జూలై 29 : కొవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్ నియంత్రణ, సీజనల్ వ్యాధుల నిర్మూలన, హరితహారం, సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్శుక్రవారంసాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కరోనా కేసులు స్వల్ప సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిస్థితి అదుపు తప్పకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పన్నెండేండ్లు నిండిన విద్యార్థులకు లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రాధాన్యత అంశంగా భావించి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో సోమవారం నుంచి ముమ్మరం చేయాలన్నారు. తూతూమంత్రంగా పనిచేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కోటగిరి మండలం కొడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు, మరో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితిపై స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అందరికీ టెస్టులు చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. కరోనాబారినపడిన వారిని ఐసొలేషన్లో ఉంచి తగిన చికిత్స అందించాలని, పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి మండలంలో ఎంపీడీవో, మండల వైద్యాధికారి గ్రామాలను సందర్శించి సర్వే తీరును పరిశీలించాలని ఆదేశించారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, మెప్మా కో-ఆర్డినేటర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా దోమ తెరలు వాడేలా అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలన్నారు. హరితహారం ప్రగతిని సమీక్షిస్తూ, వచ్చే వారం రోజుల్లోగా నిర్దేశించిన లక్ష్యంలో 80 శాతం వరకు మొక్కలు నాటేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. పదిహేను రోజుల అనంతరం జిల్లాలో ఎక్కడ చూసినా మీటరు దూరానికి ఒక మొక్క తప్పనిసరిగా కనిపించాలన్నారు. ప్రధానంగా రోడ్లకిరువైపులా ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తూ, వరుస క్రమంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనివ్వాలని, రైతువేదికలు, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కలు, ట్రీ గార్డులను సరి చేసుకోవాలని, మొక్కల సంరక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్వో సుదర్శన్, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, డీఆర్డీవో చందర్, మెప్మా పీడీ రాములు, పంచాయతీరాజ్ ఈఈలు శంకర్, మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.