కమ్మర్పల్లి, జూలై 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ బాదుడుతో చిరు వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ఛాయ్ వాలా ప్రధాని అయితే తమలాంటి చిన్నచిన్న బతుకుదెరువు దందాలకు కేంద్రం నుంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆశపడ్డ చాయ్ దందా వ్యాపారులు మొదలుకొని చిరు వ్యాపారులు తాజా జీఎస్టీ విధింపుతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తాజాగా 14 రకాల నిత్యావసరాలపై జీఎస్టీ విధించింది. ప్యాకేజ్డ్ పదార్థాలపై జీఎస్టీ, నిత్యావసరాలపై జీఎస్టీ, భాస్మతి బియ్యంపై జీఎస్టీ… పాలు, పెరుగు, తంబాకు, ఇలా నిత్యం అవసరమయ్యే వాటిపై జీఎస్టీ విధించడంతో చిరు వ్యాపారుల ఉపాధిపై పెద్దదెబ్బ పడింది. పాలు, పెరుగు, బియ్యంలాంటి నిత్యావసరాలతో పాటు విద్యార్థులు వాడే పెన్సిళ్లు, బ్లేడ్లు చివరకు కొబ్బరి నీళ్లపైనా జీఎస్టీ అమలు చేస్తోంది.
పాలపై జీఎస్టీ కారణంగా హోటళ్లు నడుపుకొనే వారు, చిన్నచిన్న బేకరీ వ్యాపారాలు, స్వీట్ తయారీ, విక్రయాల వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్యాక్ చేసి విక్రయిస్తుంటారు. తినుబండారాలు తయారుచేసే కుటుంబం ఉపాధి, చిన్నచిన్న జనరల్ స్టోర్స్ నిర్వహించే వ్యాపారులు తమ ఉపాధిలో జీఎస్టీ భారాన్ని ఎదుర్కోనున్నారు. జీఎస్టీ భారంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి విక్రయాలు తగ్గే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. బ్రాండెడ్గా ఆహార పదార్థాలు, తినుబండారాలను మహిళా సంఘాలు ప్యాకింగ్ రూపంలో విక్రయిస్తూ వ్యాపారాలు చేస్తున్నాయి. తాజా జీఎస్టీ విధింపుతో వ్యాపారాలను నష్టపరిచే అవకాశముందని ఆందోళన నెలకొంది.