ఖలీల్వాడి, మే 7 : ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఈనెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క పని పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఉపాధిహామీ, ధాన్యం సేకరణ, ధరణి తదితర కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో శనివారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. మండలాల వారీగా ఆయా అంశాల్లో సాధించిన ప్రగతిని తెలుసుకున్నారు. పనులను చేపట్టడంలో అలసత్వాన్నిప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారంలోగా పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించకపోతే సస్పెన్షన్ వేటు వేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. పరిపాలనా అనుమతులు మంజూరైన జిల్లాలోని 103 పాఠశాలల్లో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా పనులను పూర్తి చేయాలన్నారు.
ధాన్యం సేకరణపై మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా వెంటవెంటనే డబ్బులను చెల్లించాలని సూచించారు. ధరణిలో వచ్చిన ఏఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులతోపాటు ఈనెలలో వచ్చే అర్జీలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఉపాధిహామీ పనులు చేపట్టడంలో వెనుకబడి ఉన్న ఆయా మండలాల అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, డీసీవో సింహాచలం, పంచాయతీరాజ్ ఈఈ శంకర్నాయక్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కో-ఆర్డినేటర్ కాసుల సాయితేజ, లక్ష్మీకాంత్, సంజీవ్రావు, నాగేశ్, జగన్ మోహన్, సుభాష్, వినయ్, సుజాత, శ్రీలత, అపర్ణ, సునీత, సమత తదితరులు పాల్గొన్నారు.