దీపావళి వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. పూలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పటాకుల దుకాణాల వద్ద జన సందోహం కనిపిస్తున్నది. మార్కెట్లో వివిధ ఆకృతుల్లో దీపెంతలు, లక్ష్మీదేవి ప్రతిమలు, చిత్రపటాలు అమ్మేందుకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యానగర్, అక్టోబర్ 23 : భారతీయ సంస్కృతిలో ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకొనే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నా యి. అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీ రాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకొంటారని రామాయణం చెబుతోంది. ఈ సంబురాలు జరుపుకొనే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు కట్టి పటాకులు కాల్చి వేడుక చేసుకుంటారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. దీపాల పండుగకు ముందురోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీన్ని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. కానీ ఈ ఏడాది మంగళవారం సూర్యగ్రహణం ఉండడంతో ముందు రోజు సోమవారం ఒకే రోజు ఉదయం హారతులు, సాయం త్రం ధనలక్ష్మీ పూజలు నిర్వహించనున్నారు.
ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు
ఇందూరు/బాన్సువాడ, అక్టోబర్ 23: రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకొంటామని పేర్కొన్నారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతికాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సుఖశాంతులతో , సిరిసంపదలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ పటాకులు కాల్చాలని, ఇంటిల్లిపాది ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు.
సంరక్షించే పండుగ…
భాద్రపద మాసంతో వర్ష ఋతువు ముగిసి, ఆశ్వయుజ మాసంతో శరదృతువు ప్రారంభమవుతుంది. ఈ మాసం చివరి నాటికి వాతావరణం చల్లబడడంతోపాటు పొడిగా మారుతుంది. గాలి ద్వారా వ్యాధులను సంక్రమింపజేసే వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అధికమవుతాయి. ముఖ్యంగా జలుబుకు కారణమైన కోల్డ్ వైరస్లు, బ్యాక్టీరియాలు, చికెన్ పాక్స్ వైరస్, హెర్సెస్ వైరస్, డిప్తీరియా, టీబీ, కోరింత దగ్గు, గొంతు వాపు, బ్యాక్టీరియల్ న్యూమోనియాలను కలిగించే బ్యాక్టీరియాలు అనేక చర్మ వ్యాధులకు కారణమైన శిలీంధ్రాలు మానవులపై ప్రతాపం చూపేందుకు సిద్ధంగా ఉంటాయి. దీపావళి సందర్భంగా దీపాల కాంతికి, కాల్చే పటాకుల నుంచి వెలువడే శబ్దం, పొగతో వాతావరణం వేడెక్కుతుంది. ఈ కాంతి, మెరుపుల పొగలో ఉండే మెగ్నీషియం, మాంగనీసు లోహాలు, తీవ్రమైన ధ్వనితో వచ్చే శక్తివంతమైన శబ్ద తరంగాలు గాలిలో వ్యాపిస్తాయి. ఇవి ఆయా వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. ఇలా మానవులను సంరక్షించే పండుగగా దీపావళి ప్రత్యేకత.
లక్ష్మీపూజలు..
దీపావళి పండుగను వ్యాపారవర్గాలు ఘనంగా నిర్వహిస్తాయి. లక్ష్మీ కటాక్షం లభించాలని ధనలక్ష్మికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అమావాస్య రోజు కొత్త వస్ర్తాలు ధరించి ఖాతా పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంకాలం దీపాల తోరణాలతో ఇళ్లన్నీ వెలుగులతో ప్రకాశించేలా దీపాలు ఏర్పాటు చేస్తారు. ఎవరి ఇండ్లయితే దీపాలతో సుందరంగా ఉంటాయో వారింటికి లక్ష్మీదేవి తరలివస్తుందని ప్రజలు నమ్ముతారు. దీంతో ప్రజలందరూ దీపావళి అమావాస్య రోజు ఇంటిల్లిపాదీ ఇండ్లను శుభ్రం చేసుకొని దీపాలతో సుందరంగా తీర్చిదిద్దుతారు.
దీపాలంకరణ.. లక్ష్మీ పూజ…
దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళలందరూ ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తిక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ముత్తయిదువులు కార్తిక పౌర్ణమికి సముద్ర స్నానాలు ఆచరించి జీవనదుల్లో వదులుతారు. నిజానికి దీపావళి ఋతువులు మారే సమయంలో వస్తుంది. వర్షాలు వెనుకబడి, వ్యవసాయ పనులు ముగుస్తాయి. రైతులు పనిముట్లను శుభ్రం చేసి మూలనపెడతారు. రాబోయే చలిని తట్టుకునేందుకు అంతా సిద్ధమవుతారు. బంధువులంతా ఒక చోటికి చేరుతారు. కొత్తగా పెండ్లిళ్లు చేసిన కుటుంబాల్లో కూతురిని,అల్లుడిని ఇంటికి ఆహ్వానిస్తారు. రకరకాల పిండి వంటకాలు చేస్తారు. మహిళలు నోములు, వ్రతాలు చేస్తారు. అలా అప్పటి నుంచి ప్రజలు దీపావళి రోజు లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు. దీపావళి రోజు మహాలక్ష్మీని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
పటాకులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండండి
కంటి వైద్యనిపుణుల సూచన
కోటగిరి, అక్టోబర్ 23:
రంగురంగుల వెలుగులు, ఆనందాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ చిన్నపాటి తప్పిదాలతో జీవితాన్నే చీకటిగా మార్చివేస్తుంది. పటాకులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండకపోవడం, అత్యుత్సాహంతో చేతిలో పటాకులు పట్టుకొని పేల్చడం, అవగాహన లేక చిన్నపిల్లలు ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు పటాకులు కాల్చే సమయంలో పెద్దవారు దగ్గర లేకపోవడం, సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో చిన్నారులు పటాకులను ఇష్టానుసారంగా కాల్చుతారు. ఫలితంగా పటాకులు పేలడంతో కాలిన గాయాలకు గురవ్వడంతోపాటు ముఖ్యంగా చాలా మంది కండ్లు పోగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20 నుంచి 30మంది కాలినగాయాలకు గురవ్వడం.. అందులో అధికంగా కండ్లు దెబ్బతినే కేసులే ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దీపావళి పండుగ సమయంలో ప్రజలు, చిన్నారులు జాగ్రత్తలు పాటించి, ఆనందంగా పండుగను జరుపుకోవాలని కంటి వైద్యనిపుణులు తెలిపారు.
జాగ్రత్తలు