ఖలీల్వాడి, సెప్టెంబర్ 15 : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు ఘనంగా నిర్వహించనుంది. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా తొలిరోజైన శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో 15 వేల మందితో సమైక్యతా ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యమయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. జాతీయ జెండాలతో నిర్వహించే భారీ ర్యాలీల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బాల్కొండలో నిర్వహించే బైక్ ర్యాలీలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొంటారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొంటారు.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ నుంచి తెలంగాణ పార్కు వరకు రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్లు కాంతులీనుతున్నాయి.
వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న స్వాతంత్య్ర వేడుకల తరహాలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. నిజామాబాద్లో ఇన్చార్జి మంత్రి హోదాలో వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మువ్వన్నెల జెండాలను ఎగురవేస్తారు.