నిజామాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని దేవుడి భూములను కొందరు ఆక్రమించారు. ఆలయాల ఆస్తులను ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే, ఎంతో విలువైన ఆయా భూములను కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల భూములపై ఇటీవల సర్వే నిర్వహించింది. ప్రస్తుతం ఆలయాల పరిధిలో ఉన్న భూములెన్ని? కబ్జాకు గురైన వివరాలేంటి? ప్రస్తుతం ఆధీనంలో ఉన్నవి ఎన్ని? అని వివరాలు సేకరించింది. ఇందులో వందలాది దేవాలయాల పరిధిలో విలువైన సాగు భూములు కబ్జాకు గురయ్యాయని తేలింది. ప్రముఖ దేవాలయాలతో పాటు గ్రామ పంచాయతీల్లోని పురాతన ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీసింది. ఇలా వెలుగు చూసిన దేవాదాయ, ధర్మాదాయ భూములను దేవుడి పేరిటే రికార్డుల్లోకి ఎక్కించి హక్కు పత్రాలను కల్పించి చట్టబద్ధ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్న వందలాది ఎకరాల భూములకు విముక్తి కల్పించడంతో పాటు ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూముల వైపు ఇతరులెవరూ కన్నెత్తి చూడకుండా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 228.21 ఎకరాలను ఈ మేరకు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గెజిట్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గెజిట్లో భూముల వివరాలు నమోదు చేస్తే కబ్జా చేయడానికి, అన్యాక్రాంతం కావడానికి అవకాశమే ఉండదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,358 దేవాలయాలున్నాయి. వీటి పరిధిలో దాదాపుగా నాలుగు వేల ఎకరాల మేర దేవాదాయ భూములున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 1,600 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. మిగిలినవి గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉండగా, వాటిని సాగులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాగుకు అనుకూలంగా ఉన్న దేవాదాయ భూములను ఏటా వేలం వేసి తద్వారా వచ్చిన రాబడిని ఆలయాల అభివృద్ధికే అందిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 361 దేవాలయాల పరిధిలో 1,627 ఎకరాలకు కౌలు వేలం నిర్వహిస్తున్నారు. 2020లో 744 ఎకరాలకు వేలం నిర్వహించగా, సుమారుగా రూ.40లక్షల ఆదాయం వచ్చింది. అయితే, 2021లో వేలం వేయడంలో దేవాదాయ శాఖ అధికారులు జాప్యం చేశారు. 2022లోనూ వేలం ప్రక్రియ నిర్వహించలేదు. తద్వారా ఆలయాలకు రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు దేవాలయాలకు ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ర్టాల్ల్లోనూ భూములున్నాయి. వీటి సంరక్షణకు దేవాదాయ శాఖ సీరియస్గా దృష్టి సారించింది. కొంత కాలంగా ఆలయాల ఆస్తుల వివరాలను సేకరించగా, కబ్జాకు గురైన భూముల వివరాలు వెలుగు చూశాయి. దీంతో ఉభయ జిల్లాలోని సుమారు 228.21 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో మహారాష్ట్రలోని ధర్మాబాద్లో అత్యధికంగా 74 ఎకరాల భూములుండడం విశేషం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో దేవాలయాలున్నాయి. నిత్య పూజలతో, ప్రజల ఆరాధనలతో కళకళలాడే ఆలయాలకు దశాబ్దాల క్రితం నుంచి వందల ఎకరాల మాన్యం ఉంది. కాలం గడిచిన కొద్దీ ఆయా భూముల వివరాలు మరుగున పడిపోయాయి. ఇదే అదనుగా కొంత మంది రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు కలిసి కబ్జాదారులకు వంత పాడారు. ఫలితంగా విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇలా ఒక్కో దేవాలయ పరిధిలో గుంటల నుంచి వందల ఎకరాల వరకు కబ్జాలకు పాల్పడినట్లు సర్వేలో తేలింది.
దేవాదాయ శాఖ సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికొచ్చాయి. ఎల్లారెడ్డిలో వెలుగు చూసినట్లుగా, కొన్ని భూములను అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. మరికొన్ని భూములకు సంబంధించిన రికార్డులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాయం చేసే కుట్రకు పాల్పడ్డారు. పాత రికార్డులను తిరిగి తోడగా కబ్జాదారుల కథలు బయటపడ్డాయి. సర్కారు స్వాధీ నం చేసుకున్న 228.21 ఎకరాల్లో అత్యధికంగా రెంజల్ మండలంలోని నీలా టెంపుల్ భూములే ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన అన్యాక్రాంతమైన 74 ఎకరాల భూములను మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా ధర్మాబాద్లో గుర్తించారు. నిజామాబాద్లోని నీలకంఠేశ్వరాలయానికి చెందిన విలువైన భూములను స్వాధీనం చేసుకున్నారు. బతుకమ్మకుంట, కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో గల మూడు ఎకరాలను గుర్తించి హద్దులు కూ డా పాతారు. నవీపేట మండలం యంచలోని సీతారామాలయానికి సంబంధించి 18 ఎకరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నవీపేట, బినోలాలో అనుబంధ ఆలయాలకు సంబంధించిన 35 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, ఎల్లారెడ్డిలో ఎకరాల కొద్దీ భూములు వెలుగు చూశాయి. కొన్ని చోట్ల దేవాదాయ శాఖకు చెందిన అధికారుల నిర్లక్ష్యం, మామూళ్ల వ్యవహారం కారణంగా పురాతన ఆలయాల భూముల చిట్టా బయటికి రావడం లేదు.