పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందుకు అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులను గ్రామాలకు విడుదల చేస్తున్నది. నిధుల వినియోగంలోనూ పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటున్నది. గతంలో ఉన్న మ్యానువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్లో పంచాయతీ నిధుల ఆడిటింగ్కు చర్యలు తీసుకుంటున్నది. నిధుల వివరాలు, వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నది. ప్రజలు సైతం వివరాలను తెలుసుకునే అవకాశం ఉండడంతో నిధుల వినియోగం పారదర్శకంగా సాగనున్నది. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఉన్న 526 గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియను అమలుచేస్తున్నారు.
కామారెడ్డి, సెప్టెంబర్ 19: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకు అనుగుణంగా తగు ప్రణాళికలను రూపొందించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నది. పంచాయతీలకు పుష్కల నిధులు ఇవ్వడంతోపాటు మంజూరైన నిధుల వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. గతంలో ఉన్న మ్యానువల్ పద్ధతికి స్వస్తి చెప్పి పంచాయతీల ఆడిటింగ్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రామ పంచాయతీల లెక్కలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తుండడంతో నిధుల వివరాలు, వినియోగ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానంతో నిధుల వినియోగంలో పారదర్శక మరింత పెరిగే అవకాశం ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఉన్న 526 గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియను అమలుచేస్తున్నారు.
526 జీపీల్లో ఆడిటింగ్..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వం పంచాయతీల ఆడిటింగ్ను ప్రారంభించింది. జిల్లాలోని కామారెడ్డి డివిజన్లో 164 గ్రామ పంచాయతీలు, ఎల్లారెడ్డి డివిజన్లో 141, బాన్సువాడ డివిజన్లో 221 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఇతర లెక్కలను ఆడిట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే చివరి అంకానికి చేరుకోగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఆడిటర్ కలిసి పంచాయతీకి సంబంధించిన ఆదాయ వ్యయాల పద్దులను ప్రత్యేక లాగిన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది.
మ్యానువల్ పద్ధతికి స్వస్తి..
గతంలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, ఇతర లెక్కలను మ్యానువల్ పద్ధతిలో చేపట్టేవారు. మ్యానువల్ పద్ధతిలో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండేది. లంచం ఇచ్చి ఆడిట్ చేయడంతో అభివృద్ధి పనులు అటకెక్కే పరిస్థితి నెలకొనేది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా ఉండేందుకు ఆన్లైన్ విధానం మేలు చేకూరుస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 31వ తేదీని కటాఫ్గా తీసుకొని ఆడిటింగ్ చేపడుతున్నారు. గ్రామంలో చేపట్టే పనుల వివరాలు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ప్రజలందరూ తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో అవినీతికి తావులేకుండా పోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరుచేసిన నిధులు, ఖర్చు చేసిన వివరాలు స్పష్టంగా ఉంటాయి.
లెక్కలన్నీ ఆన్లైన్లోనే..
గ్రామ పంచాయతీ లెక్కలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. నిధుల జమాఖర్చుల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో ఆడిటింగ్ను చేపడుతున్నది. ప్రభుత్వాలు ఎన్ని నిధులు మంజూరు చేశాయి..? ఏయే పనుల కోసం ఖర్చు చేశామనే లెక్కలు ఆన్లైన్లో చూసుకోవచ్చు.
-సునంద, జిల్లా పంచాయతీ అధికారి, కామారెడ్డి