డిచ్పల్లి, అక్టోబర్ 14: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు ఏమీ చేయవద్దని అన్ని పారదర్శకంగా ఉండాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవితను గురువారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్గుప్తా, రిజిస్ట్రార్ కనకయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ నియామకాలపై ఇన్ని ఆరోపణలా అని వారిని ప్రశ్నించారు. నెలరోజులుగా టీయూ అక్రమ నియామకాలపై మీడియాలో వస్తున్న వరుస కథనాలపై ఇదేమిటని అడిగారు. నిబంధనలు పాటించకుండా పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో అత్యవసరం ఉండడంతో 12 మందిని మాత్రమే భర్తీ చేసుకున్నామని వీసీ ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. విశ్వవిద్యాలయంలో ఒక ప్రత్యర్థివర్గం తయారైందని వారే వెనక ఉండి మరీ దుష్ప్రచారం చేయిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇలాంటివి తనకు చెప్పవద్దని మరోసారి ఇలాంటి విషయాలు జరుగకుండా చూసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థి సంఘాలతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. టీయూలో భర్తీ చేసిన పోస్టులను మీడియా ముఖంగా రద్దు చేసినట్లు ప్రకటించాలన్నారు. పార్ట్టైం అధ్యాపకులను కూడా నిబంధనల మేరకు పాలకమండలి అనుమతి తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూల ద్వారా వారి డెమో పరిశీలించిన తర్వాతనే భర్తీ చేసుకోవాలని ఎమ్మెల్సీ సూచించినట్లు రిజిస్ట్రార్ కనకయ్య తెలిపారు. విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల అధిపతులతో మాట్లాడి నోటిఫికేషన్ లేకుండా గతంలో తీసుకున్న పార్ట్టైం అధ్యాపకులను వెం టనే రిమూవ్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
సైన్స్ భవనం శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రూసా నిధులు రూ. 10కోట్లతో చేపట్టనున్న సైన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితను వీసీ, రిజిస్ట్రార్ కోరారు. సైన్స్ భవనం సకాలంలో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని, సమయాన్ని కేటాయించి శంకుస్థాపనకు రావాలని కోరారు. ఈనెల 29, 30న సమయం కేటాయిస్తానని అప్పుడు పనులు పెట్టుకోవాలని ఎమ్మెల్సీ వారికి సూచించారు. త్వరలోనే మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి సమ యం తీసుకుంటామని శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని వారు తెలిపారు.