నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8 : గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకురావాలని కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని లక్ష్మాపూర్, బాలాజీనగర్ తండాలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు బురదమయంగా ఉండడంతో సర్పంచ్తో మాట్లాడారు. అవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గా లేకపోవడం, పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి మగ్దూంను సస్పెండ్ చేశారు. బాలాజీనగర్ తండాలో మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో వైకుంఠధామం, హసన్పల్లి, సుల్తాన్నగర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ను కలెక్టర్ శరత్ పరిశీలించారు. నిజాంసాగర్ వైకుంఠధామంలో మొక్కల నిర్వహణ సక్రమంగా లేదని, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజాంసాగర్లో పల్లెప్రగతి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి సంతోష్ ప్రొబేషనరీ కాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఆదేశించారు.
లింగంపేటలోని వైకుంఠధామం వద్ద కలెక్టర్ శరత్ మొక్కలను నాటారు. దుకాణాల వద్ద మొక్కలు నాటి వాటి సంరక్షణను దుకాణ యజమానులకు అప్పగించాలని సూచించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని సర్పంచ్ లావణ్యకు సూచించారు. పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్లో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. ఆయనకు సర్పంచ్ కవిత, ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. పల్లెప్రకృతివనంలో కలెక్టర్ మొక్కలు నాటారు. మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలకు నీరుపోశారు. జుక్కల్ మండలంలోని కెంరాజ్పల్లి, పెద్దకొడప్గల్ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలోని పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్ పరిశీలించి మొక్కను నాటారు. బీర్కూర్-బిచ్కుంద ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్థానిక అధికారులను హెచ్చరించారు.బిచ్కుంద మండలకేంద్రంలోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాన్ని కలెక్టర్ పరిశీలించారు. పార్క్లో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం, మొక్కలను పంపిణీ చేయకపోవడంతో పంచాయతీకార్యదర్శి రమేశ్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంక్రిమెంట్ కట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.కామారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో కలెక్టర్ పర్యటించారు. విద్యానగర్లో పార్కును పరిశీలించి మరిన్ని మొక్కలు నాటాలని సూచించారు. మున్సిపాలిటీ యాక్ట్-2019 ప్రకారం ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో పది శాతం తప్పకుండా పచ్చదనం పెంపొందించడానికి వినియోగించుకోవాలన్నారు.