ఖలీల్వాడి : టెలీ మెడిసిన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పీహెచ్సీ నుంచే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్ దవాఖానలో టెలీ మెడిసిన్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ, సీహెచ్సీ నుంచే పేషంట్లు జిల్లా ప్రభుత్వ దవాఖానకు రావాల్సిన అవసరం లేకుండా వారి సమస్యలు విన్నవించుకుంటే డాక్టర్లు వివరాలు తెలుసుకుని సంబంధించిన అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మందులు ఏ విధంగా వాడాలో తెలియజేస్తారన్నారు.
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు ఇది మంచి అవకాశమని, జిల్లా కేంద్రం వరకు రావాల్సిన అవసరం లేకుండానే టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి పీహెచ్సీలో టెలీ మెడిసిన్ షెడ్యూల్ ఫ్లెక్సీ రూపంలో ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని వైద్యాధికారులకు సూచించారు. ఏ రోజు ఏ డాక్టర్ అందుబాటులో ఉంటే ఆ డాక్టర్తో రోగులు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.
రోగులు ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజు, ఇన్చార్జి డీఎంహెచ్వో సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్వో తుకారం రాథోడ్, డాక్టర్లు వెంకన్న, జలగం తిరుపతిరావు, విశాల్, సరస్వతి, జయ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.