నిజామాబాద్, ఏప్రిల్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సృష్టిస్తున్న విధ్వంసాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో అడ్డుకుంటున్నది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అత్యవసర సేవలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. సెకండ్ వేవ్లో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్, వెంటిలేటర్ల సౌకర్యాన్ని భారీగా పెంచింది. ప్రైవేటు దవాఖానలకు కొవిడ్-19 చికిత్సకు అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్ల్లో పడకల సంఖ్యను భారీగా పెంచింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యం లో టెస్టింగ్ కోసం వస్తున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓ వైపు వాక్సినేషన్ ప్రక్రియను, మరోవైపు కరోనా నిర్ధారణను వేగంగా చేస్తోంది. నెల రోజుల్లో కరోనా పరీక్షలు, వాక్సినేషన్ భారీగా పెరిగింది. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు నిరంతర సేవలు అందిస్తున్నారు. తమ కుటుంబాలను కాదని కరోనాతో బాధపడుతున్న వారి బాగు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కరోనా కోరలు చాస్తుండడంతో నిత్యం వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. నెల రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కేవలం రోజుకు 500 టెస్టులు మాత్రమే జరుగగా ప్రస్తుతం ఈ సంఖ్య వేలకు చేరింది.