ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని రైతు జేఏసీ నాయకులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, రైతు సంఘ నాయకులు పల్లెపు వెంకటేశ్, దేవారాం, లింగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆర్మూర్లోని కుమార్ నారాయణ్ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వామినాథన్ కమీషన్ సిఫారసులను అమలు చేసి రైతుకు రెండింతలు ఆదాయం తెచ్చి పెడుతామని అధికారంలోకి రాక ముందు బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న వాటి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రస్తుతం బీజేపీ విధానాల మూలంగా రైతుల అప్పుల పాలై ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రతిపాదికన ఏర్పాటు చేసి రూ.1850/- లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మంథని గంగారాం, సారా సురేశ్, రాజన్న, రాజేశ్వర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.