ఇందూరు : ఆదివారం నిజామాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ప్రజలు ఆనందంగా పాల్గొనేందుకు గాను పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ శనివారం తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మరాదని, ఏదేని సమాచారం ఉంటే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. శోభాయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయని, హైదరాబాద్ నుంచి బోధన్ వయా మాధవ్ నగర్ , బైపాస్ రోడ్డు కంఠేశ్వర్ , అర్సపల్లి, బోధన్ వెళ్లాలని, బోధన్ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు బోధన్ , అర్సపల్లి, బైపాస్ , కంఠేశ్వర్ , మాధవ్నగర్ గుండా వెళ్లాలని వివరించారు. బాసర బ్రిడ్జిపై నిమజ్జనం జరిగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందన్నారు.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలను జానకంపేట, సాటాపూర్ గేట్ , కందకూర్తి, ధర్మాబాద్ , బిద్రెలి, బైంసా గుండా వెళ్లాలని తెలిపారు. గణేశ్ నిమజ్జనం తర్వాత వాహనాలు బిద్రెల్లి, ధర్మాబాద్ , కందకూర్తి ద్వారా లేదా భైంసా, నిర్మల్ , ఆర్మూర్ నిజామాబాద్ రావల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు 19 నుంచి 20న సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం, రైల్వేకమాన్ , కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు మీదుగా మాధవ్నగర్ వైపునకు వెళ్లాలన్నారు.
మద్యం తాగి గణేశ్ నిమజ్జన వాహనాలు నడిపే వారిపై ఆల్కామీటర్తో పరీక్షలు జరుపుతామని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, టపాకాయలు కాల్చరాదని సీపీ కార్తికేయ వివరించారు. బందోబస్తులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.