కేటీఆర్కు మొక్క నాటి జన్మదిన కానుకనిచ్చిన జనం
గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఊరూరా హరిత స్ఫూర్తి
పంచాయతీకి వెయ్యిచొప్పున.. ఉభయ జిల్లాలో 10లక్షల పైచిలుకు మొక్కలు
పిలుపులో భాగమైన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు
నిజామాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జనహృదయ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రీన్చాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విజయవంతమైంది. ఉదయం 10 నుంచి గంటపాటు మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా సాగగా.. కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్కు హరితకానుకగా ఉభయ జిల్లాల్లో 10లక్షలకు పైగా మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు. పలుచోట్ల కేకులను చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వృక్షార్చనలో భాగంగా కొందరు మొక్కలతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం దిగ్విజయమైంది. ఉమ్మ డి జిల్లాలో కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, ఎ మ్మెల్యేలు, మంత్రి వేముల, సభాపతి పోచారంతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ఆరాధనలో భాగంగా కేటీఆర్కు హరితకానుకగా మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు. భిన్న రకాలైన మొక్కలను ఖాళీ స్థలాల్లో నాటి ప్రకృతిని ఆరాధిస్తూ మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు సీఎం కేసీఆర్ సంకల్పానికి మద్దతు ప్రకటిస్తూనే… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించారు. ఉభయ జిల్లాలో ఉదయం 10 నుంచి 11గంటల వరకు మొక్కలు నాటే కార్యక్రమం ఉవ్వెత్తున సాగింది.
గ్రామ పంచాయతీకి వెయ్యి మొక్కలు..
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో 1056 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 10లక్షల 56 వేల మొక్కలను నాటేలా ప్రణాళికలు రచించారు. నిజామాబాద్ జిల్లాలో 530 జీపీల్లో 5లక్షల 30వేల మొక్కలు నాటినట్లుగా అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని 526 జీపీల్లో 5లక్షల 26వేల మొక్కలు నాటినట్లు సమాచారం. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా స్థల సమస్య ఎదురుకాకుండా వినూత్న ఆలోచనకు అధికారులు పదును పెట్టారు. ఇప్పటికే మండలాల్లో 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు సేకరించారు. కొన్ని చోట్ల బీపీపీవీల్లోనూ భారీగా మొక్కలు నాటించారు. తద్వారా మున్సిపాలిటీల్లోనూ ఖాళీ ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటారు. సర్పంచులు, కార్యదర్శులు, యువజన, మహిళా సంఘాల సభ్యులకు అన్ని మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ మొక్కలు నాటాలన్న విషయంపై స్పష్టతను ఇవ్వడంతో సాఫీగా కార్యక్రమం పూర్తయ్యింది. పలు ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వించి కొత్తగా నిర్మించిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలకు వెళ్లేదారులు, డంపింగ్ యార్డు పరిసరాలతోపాటుగా ఇతర చోట్ల కూడా మొక్కలు నాటారు.
వాడవాడలా హరితోత్సవం..
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. కేవలం గంటసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఉభయ జిల్లాల్లో గంట సేపట్లోనే భారీ సంఖ్యలో మొక్కలు నాటేలా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపును అందుకున్న లక్షలాది మంది ప్రజలు నిర్ణీత సమయంలో ముందస్తుగానే సిద్ధం చేసుకున్న గుంతల్లో మొక్కలు నాటి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వృక్షార్చనలో పాల్గొన్న వారు 90003 65000 నంబర్కు సెల్ఫీ దిగి పంపించారు. కొద్దిరోజుల్లోనే ముక్కోటి వృక్షార్చనకు సంబంధించిన సర్టిఫికెట్ సంబంధిత వ్యక్తులకు అందనున్నది. ప్రతిష్టాత్మకమైన హరితోద్యమంలో పాల్గొన్న వారందరికీ తీపి గుర్తుగా ఈ -సర్టిఫికెట్ మిగిలిపోనున్నది.
కేటీఆర్కు హరిత తిలకం..
ముక్కోటి వృక్షార్చన పిలుపులో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు ప్రాంతాల్లో మొక్కలు నా టారు. బాన్సువాడలోని తాడ్కోల్లో మొక్కలు నాటి స్పీకర్ హరిత స్ఫూర్తిని చాటారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్లోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో వృక్షార్చనలో పాలుపంచుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన అనుచరులతో కలిసి మొక్కలు నాటారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సైతం నిజాంసాగర్, పిట్లం మండలాల్లో కేటీఆర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ మొక్కలు నాటారు. నిజామాబాద్ నగరంలోని కొత్త కలెక్టరేట్ సమీపంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మొక్కలు నాటారు. భారీ కేక్ను కట్ చేశారు. ఆకుపచ్చ టీ -షర్టులు ధరించిన యువకులతో కలిసి బైపాస్ రోడ్డుపై భారీగా మొక్కలు నాటించారు. కేటీఆర్ పుట్టిన రోజును బాజిరెడ్డి గోవర్ధన్ ఘనంగా నిర్వహించారు. ఈగ గంగారెడ్డితో కలిసి బోర్గ్గాం(పీ)లో కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. మోపాల్ మండల కేంద్రానికెళ్లే ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సైతం పట్టణంలో గులాబీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు అందజేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీ, మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొక్కలు నాటారు. బాన్సువాడ నియో జక వర్గంలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి మొక్కలు నాటారు.