విద్యార్థుల చేరిక (ఎన్రోల్మెంట్) అనే సవాల్ను దేశంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య క్షీణదిశగా పయనిస్తున్నది. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, చేరిక సగానికి పడిపోయింది. ఇలా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను సాధారణంగా తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్గా పరిగణిస్తున్నారు. ఇవి సాధారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలలై ఉంటున్నాయి. ఈ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుడు అనేక బోధనేతర పనులతోపాటు, పాఠశాలలో ఉన్న తరగతులకు అన్ని సబ్జెక్టులు చెప్పాల్సి వస్తున్నది. దీనికి పరిష్కారం స్కూల్ క్లస్టర్ విధానమే అసలైన పరిష్కారం.
బోధన, బోధనేతర కార్యాచరణద్వారా విద్యార్థులు సమగ్రాభివృద్ధి సాధించేటట్లు చూడటమే విద్య అంతిమ లక్ష్యం. 1988 నుం చి విధాన పరంగా సెకండరీ స్కూల్ లెవల్ నుంచి వృత్తివిద్యకు ప్రాధాన్యమిచ్చారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి ఏమంటే.. చాలా పాఠశాలలు కనీస సౌకర్యాల లేమి, వనరుల కొరతతో సతమతమవుతున్నాయి. ఆర్థిక వనరులే కాకుండా, మానవ వనరులు అంటే సరియైన ఉపాధ్యాయులు లేని పరిస్థితి కూడా ఉంటున్నది. ఇక చిత్రకళ, గేమ్స్-స్పోర్ట్స్, సంగీతం, క్రాఫ్ట్స్ లాంటి వాటి గురించి చెప్పేదేముంటుంది? వీటన్నింటికీ భౌతిక అవసరాలు ఆట వస్తువులు, గ్రంథాలయం, ప్రయోగశాల లాంటివి చాలా పాఠశాలల్లో అందుబాటులో లేవు. కొన్నిబడుల్లో ఇవి ఏదో మేర ఉన్నా.. వాటిని వినియోగంలోకి తెచ్చే విధంగా సక్రమ నిర్వహణ ఉండటం లేదు. ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ‘2020- నూతన విద్యా విధానం’ (ఎన్ఈపీ) సిఫారసుల్లో పాఠశాల విద్యకు సంబంధించి ‘స్కూల్ కాంప్లెక్స్’ లేదా ‘స్కూల్ క్లస్టర్’ విధానం గురించి నొక్కి చెప్పింది. ఈ విధానంలో సమీప పాఠశాలలను ఒక క్లస్టర్ లేదా గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ హయాంలోనే ఈ విధానాన్ని అనుసరించారు. స్వాతంత్య్రానంతరం 1960లో కొఠారి కమిషన్ కూడా దీన్నే సూచించింది. ఈ క్లస్టర్ విధానాన్నే 1970ల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాల్లో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో అమలు చేశారు. సమీప పాఠశాలలను కలిపి ఒక ‘కోర్ స్కూల్’గా ఏర్పడటాన్నే స్కూల్ క్లస్టర్ అనొచ్చని యునెస్కో దీన్ని నిర్వచించింది. ఒకే భౌగోళిక పరిసరాల్లో ఉన్న పాఠశాలలను ఒక గ్రూప్గా ఏర్పాటు చేస్తారు. వాటికి అవసరమైన భౌతిక, మానవ, ఆర్థిక వనరులను వినియోగించుకునేందుకు వీలుగా క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తారు. దీంతో అవి నిర్వహణతో పాటు, ఉపాధ్యాయులను మార్చుకోవటంతో పాటు వనరులను పంచుకొంటాయి. వనరుల లేమి పరిస్థితుల్లో ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం ఫలితంగా.. ఉపాధ్యాయులను ఒక పాఠశాల నుంచి అవసరమైన మరో పాఠశాలకు వినియోగించుకోవటం, బోధనా ఉపకరణాలు పంచుకోవటం.. ఓ క్లస్టర్లో ఉన్న పాఠశాలలు సమిష్టిగా చేస్తాయి. దీని ద్వారా నిర్వహణాపరమైన సమస్యలను అధిగమించటమే కాకుం డా.. బోధనా పరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవటం, అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రాంతంలోని విద్యానైపుణ్యాలకు క్లస్టర్ కేంద్రంగా ఉపకరిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పడిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏకీకృతం చేయటం, హేతుబద్ధీ కరించటం అనే విధానాన్ని అనుసరిస్తున్నాయి. తద్వారా ప్రాథమిక స్థాయిలో పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటం ప్రధాన కర్తవ్యంగా వ్యవహరిస్తు న్నాయి. పాఠశాలవిద్య వికేంద్రీకరణ ద్వారా వనరుల సమీకరణ, నైపుణ్యాలు పంచుకోవటం, సమర్థంగా వినియోగించు కోవటం లాంటివి సుసాధ్యం అవుతాయి.
విద్యార్థుల బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, సమగ్రాభివృద్ధి గురించి నూతన విద్యావిధానం-2020 నొక్కి చెప్పింది. దాంతో పాటు విద్యార్థుల ప్రత్యేక ప్రజ్ఞను గుర్తించి అభివృద్ధి చేయటానికి ప్రాధాన్యమిచ్చింది. విద్యాబోధన విద్యార్థి కేంద్రంగా సాగే ఓ సమగ్ర కార్యాచరణగా ఉండాలని అభిలషించారు. భాషా నైపుణ్యాలతో పాటు, గణితం, పరిసరాల విజ్ఙానం గురించి బోధించటానికి తగువిధంగా టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అలాగే విద్యాసంస్థలు ఆయా సంస్థల్లో మానసిక నిపుణులు, సంఘసేవా కార్యకర్తల సహకారంతో విద్యార్థులు సమున్నతంగా ఎదిగే విధంగా కృషిచేయాల్సి ఉన్నది.
పరిమితమైన ప్రభుత్వ వనరుల నేపథ్యంలో పాఠశాలలకు అవసరమైన వసతులు, వనరుల కల్పన అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే స్కూల్ క్లస్టర్ విధానం ఎంతో ఉపయుక్తంగా మారింది. దీని ద్వారా అదనపు ఆర్థిక వనరుల అవసరం లేకుండానే సమస్యలను అధిగమించవచ్చు. ఉదాహరణకు.. ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడిని అవసరమైన పాఠశాలకు వినియోగించుకోవటం ద్వారా ఆర్థిక భారం సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగే ఇతర ఉపాధ్యాయులను కూడా అవసరమైన చోట సద్వినియోగ పర్చుకొని విద్యార్థుల అవసరాలను తీరుస్తూ సమగ్రాభివృద్ధికి తోడ్పడవచ్చు. ప్రత్యేక విడి పాఠశాల విధానం నుంచి క్లస్టర్ విధానం అనుసరించటం మూలంగా పాఠశాలలు, విద్యార్థుల అవసరాలు తీరుతాయి. అంతిమంగా పాఠశాలలు సమగ్ర రూపం సంతరించుకుంటాయి. గత అనుభవాలతో పాఠశాల విద్యను వికేంద్రీకరణ చేయటం ద్వారా సమున్నత లక్ష్యాలు సాధించటానికి అవకాశం ఉంటుంది.
(వ్యాసకర్త: డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ )
–డాక్టర్ ఇ. రేవతి