న్యూఢిల్లీ: పాకిస్థాన్పై ఇండియా 1971 యుద్ధం గెలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జావా మోటార్సైకిల్స్ రెండు కొత్త రంగుల్లో తమ బైక్స్ రిలీజ్ చేసింది. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఉత్సవాల్లో భాగంగా ఈ రెండు కొత్త రంగుల బైక్స్ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. భారత సాయుధ బలగాల నుంచి స్ఫూర్తి పొందుతూ ఖాఖీ, మిడ్నైట్ గ్రే రంగుల్లో ఈ రెండు కొత్త బైకులను రిలీజ్ చేసింది. ఈ జావా స్పెషల్ ఎడిషన్ ధరను రూ.1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది ఫార్టీ టూ కంటే రూ.15 వేలు, జావా కంటే రూ.6 వేలు ఎక్కువ. ఈ స్పెషల్ ఎడిషన్ బైకులను కస్టమర్లు జావా సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.
1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య 13 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రపంచంలో జరిగిన యుద్ధాల్లో అతి తక్కువ రోజులు జరిగిన యుద్ధాల్లో ఇది కూడా ఒకటి. తూర్పు, పశ్చిమ బలగాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ యుద్ధం తర్వాతే పాకిస్థాన్ నుంచి విముక్తి పొంది బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో 3 వేల మంది భారత జవాన్లు మృతిచెందగా.. మరో 10 వేల మంది గాయపడ్డారు.