యాచారం, జూన్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లె పకృతి వనం ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. పకృతి రమణీయతను పంచుతున్న పల్లెపకృతి వనంతో పల్లెకు కొత్తశోభ సంతరించుకున్నది. ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతన తిరుమలేశుడి గుట్టకింద ఉన్న పల్లె పకృతివనం చిట్టడవిని తలపిస్తున్నది. సాయంత్రంపూట ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తున్నది. పల్లె పకృతివనాన్ని సర్పంచ్ శ్రీధర్రెడ్డి, కార్యదర్శి సురేశ్రెడ్డి ప్రతిరోజు పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేశారు. ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని మొక్కలకు పోసి సంరక్షిస్తున్నారు. మండలంలోని 24గ్రామ పంచాయతీలకు గాను యాచారం పల్లెపకృతివనం ఆదర్శంగా నిలుస్తున్నది. పకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరుగడంతో పాటుగా అన్ని వసతులు ఉండటంతో ఇతర గ్రామాలకు మోడల్గా నిలిచింది. యాచారం పల్లెపకృతి వనంలో కడియం నుంచి అశోక, బొగోడ, కోనోకార్ఫస్ ఇతర మొక్కలను తీసుకొచ్చారు. వనంలో పండ్లు, పూలు, డిజైన్ మొక్కలను పెంచుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిత్యం మొక్కలకు నీరు అందజేసి, పాదులు తీసి, కలుపుతీసి సంరక్షిస్తున్నారు. వనం చుట్టూ ప్రహరీతో పాటుగా రెండు గేట్లు, పెద్ద ముఖద్వారం ఏర్పాటు చేశారు. వనంలో వాకింగ్ ట్రాక్ నిర్మించి, సేద తీరేందుకు దాతల సహకారంతో బెంచీలను ఏర్పాటు చేశారు.
3,500 మొక్కల పెంపకం
యాచారం పంచాయతీ పరిధిలో మొత్తం 3,500ల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో యాచారం పల్లెపకృతి వనంలో 2600ల మొక్కలు పంచాయతీకి అనుబందంగా ఉన్న మొగుళ్లవంపులో 800ల మొక్కలు, గాండ్లగూడలో 120 మొక్కలను పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇటీవల అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ పకృతివనం నిర్వహణ బాగుందని కితాబిచ్చారు.
వృక్షాలుగా పెంచడమే లక్ష్యం
పల్లె పకృతి వనంలో పెంచుతున్న ప్రతి మొక్కనూ బతికిస్తాం. మొక్కలను వృక్షాలుగా మలచడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. పంచాయతీ సిబ్బంది నిత్యం మొక్కలకు నీళ్లను పోస్తున్నారు. వనం చుట్టూ ప్రహరీ, ముఖద్వారం, రెండు గేట్లు, నడిచేందుకు ట్రాక్, కుర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేశాం. పల్లె పకృతి వనంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
-ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, సర్పంచ్ యాచారం
ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం
పల్లె పకృతివనంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం. పల్లె పకృతి వనాన్ని చిట్టడివిలా రూపొందించడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. అన్ని వసతులతో పార్కులా తీర్చిదిద్దాం. పల్లె పకృతి వనం తీరొక్క చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. చెట్లు పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు వానలు కురిసేందకు దోహదపడుతాయి.
-సురేశ్రెడ్డి, కార్యదర్శి యాచారం