విడుదల చేసిన రాహుల్ గాంధీ
తిప్పికొట్టిన బీజేపీ
న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో కరోనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై మంగళవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దేశంలో థర్డ్వేవ్ రాబోతుందన్న హెచ్చరికల నేపథ్యంలో అందుకు సంసిద్ధంగా ఉండాలని అందులో సూచించారు. ఇదే విషయమై రాహుల్ మాట్లాడుతూ.. కరోనా మొదటి, రెండో దశ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని విమర్శించారు. అందుకు కొన్ని కారణాలను తమ శ్వేతపత్రంలో పేర్కొన్నట్టు తెలిపారు. కేంద్రాన్ని వేలెత్తి చూపే ఉద్దేశం తమది కాదని చెప్పారు. తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఒక ‘బ్లూప్రింట్’ అని, థర్డ్వేవ్ను ఎదుర్కోవడంలో ఇది తోడ్పడుతుందని వివరించారు. కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని, దేశంలో వంద శాతం టీకా పంపిణీ ముఖ్యమన్న విషయాన్ని రాహుల్ నొక్కి చెప్పారు. దానికి అనుగుణంగా కేంద్రం చర్యలుండాలని సూచించారు. ఇదిలాఉండగా, రాహుల్ శ్వేతపత్రం విడుదల చేసిన కొద్దిసేపటికే బీజేపీ ఆయనపై విరుచుకుపడంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఢిల్లీలో స్పందిస్తూ.. కరోనా సంక్షోభంపై రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము మంచి చేయాలని చూసిన ప్రతిసారి దానికి కాంగ్రెస్ అడ్డుపడుతుందని విమర్శించారు.