వీపనగండ్ల, జూన్ 19 : ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా వంటి రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో వ్యవసాయంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతుల పెట్టుబడి ఖర్చుల నిమిత్తం ఈ ఏడాది వానకాలం పంట సాగుకు ముందే రైతుబంధు పథకం డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ్మచేయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం పంటలను సాగుచేయడంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల రైతులు వ్యవసామయ పనులను ప్రారంభించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా పొల్లాలను దుక్కులు దున్ని చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో రైతులు, రైతు కూ లీలు నిమగ్నమయ్యారు. భూములను సారవంతం చేయుటకు సేంద్రియ ఎరువులను ట్రాక్టర్ల సాయంతో పంట పొల్లాలోకి తరలిస్తున్నారు. భూమి సమతుల్యం కోసం చెరువులు, కుంటలలో గల నల్లటి వండ్రు మట్టిని ఇసుక పొల్లాల్లో భూములపై చల్లుతున్నారు. కందులు, పెసర్లు, ఆముదాలు, మినుములు వంటి చిరుధాన్యాల పంటలను సాగుచేసే రైతులు అనువైన వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
తొలకరిని అనుకూలంగా మార్చుకోవాలి
వర్షాధారంగా సాగు చేసే పంటలైన జొన్న, కంది, ఆముదం, పెసర, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసుకోవడానికి అన్నదాతలకు అనువైన సమయంగా భావించాలి. వరి పంట సాగు ను తగ్గించి చిరుధాన్యాల పంట సాగును పెంచుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతా ల్లో వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి వాతావరణం సహకరిస్తుంది. వర్షం ఆధారంగా వరి సాగు చేసే పొలాల్లో జనుము, జీలుగను పచ్చిరొట్టను పైరుగా విత్తుకోవాలి. జూరాల, బీమా కాలువల ద్వారా ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా సాగు చేయడం లేదా పచ్చిరొట్టగా విత్తుకోవడం మంచిది. రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలి.