న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సమయంలో సుమారు 73 శాతం మంది వృద్ధులు ఘొరమైన చీత్కారాలు, హేళన, గృహ హింసను ఎదుర్కొన్నారు. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ద్వారా ఇది వెలుగుచూసింది. వృద్ధుల జీవితాన్ని కరోనా పరిస్థితులు ఎలా ప్రభావితం చేశాయి అన్నదానిపై సుమారు 5000 మంది వృద్ధుల ప్రతిస్పందనను ఆ సంస్థ సేకరించింది. కరోనా వల్ల తమ జీవితం దారుణంగా ప్రభావితమైందని 82 శాతం మంది తెలిపారు. లాక్డౌన్ సమయంలో తమపట్ల హేళన, చీత్కారాలు, దూషణ ఎక్కువయ్యాయని చెప్పారు. కుటుంబ సభ్యులు తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని 65 శాతం మంది పేర్కొన్నారు. అలాగే ప్రతి మూడో వృద్ధ వ్యక్తి (35.1 శాతం) గృహ హింసను కూడా ఎదుర్కొన్నారు. ప్రధానంగా వృద్ధ మహిళలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. వారి ఆర్థిక స్థితిగతులు, డిపెండెన్సీ, మగవారితో పోల్చితే ఎక్కువ ఆయుర్దాయం వంటివి ప్రధాన కారణమని ఆ నివేదిక పేర్కొంది.
కాగా, కరోనావైరస్ ముప్పునకు సంబంధించి వృద్ధులు ఇప్పటి వరకు చాలా ప్రభావితమయ్యారని ఏజ్వెల్ ఫౌండేషన్ చైర్మన్ హిమాన్షు రాత్ తెలిపారు. కరోనా లాక్డౌన్ కాలంలో పెద్దల పట్ల పెరుగుతున్న చీత్కారాలు, దూషణ, హింసాత్మక సంఘటనల గురించి మొత్తం సమాజాన్ని సున్నితం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధులకు మద్దతు ఇచ్చే వ్యవస్థలు, చట్టపరమైన నిబంధనలు, అనధికారిక మద్దతు నెట్వర్క్ల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయా సంస్థలను వారికి అందుబాటులోకి తీసుకురావాలని హిమాన్షు రాత్ సూచించారు.