ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా గణాంకాలను సవరిస్తున్నారు. గత 12 రోజులుగా సవరించిన డేటాను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం మహారాష్ట్రలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,800కు పెరిగింది. మహమ్మారి వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారి మొత్తం సంఖ్య 1.08 లక్షలకు చేరింది. కరోనా మరణాల నమోదులో జరుగుతున్న జాప్యాన్ని సవరించే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. కరోనా సంక్షోభం ఒత్తిడి, మానవవనరుల కొరత వల్ల జిల్లా స్థాయిలోని ఆస్పత్రులు ఎప్పటికప్పుడు కొవిడ్ మరణాల వివరాలను అప్లోడ్ చేయలేకపోతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. జూన్ 1 నుంచి కరోనా లెక్కల సవరణ ప్రారంభించి తాజా గణాంకాలను విడుదల చేసింది.