150 ఏండ్లుగా కొనసాగుతున్న ఆయుర్వేద వైద్యం
దీర్ఘకాలిక రోగాలకు గుర్మిట్కల్ మందు ఫేమస్..
నిత్యం వేల సంఖ్యలో తరలివస్తున్న రోగులు
సొంత పొలంలోనే ఔషద మొక్కల పెంపకం
నారాయణపేట, జూన్ 12 : వాతరోగాలు, కీళ్లు, నడుము నొప్పి వంటి దీర్ఘకాలిక రోగాలతోపాటు బ్లెడ్ ప్రెషర్తో వచ్చే పక్షవాతం వంటి రోగాలకు గుర్మిట్కల్ ఆయుర్వేద మందు నయం చేస్తున్నది. నారాయణపేట పట్టణానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా గుర్మిట్కల్ తాలూకా కేంద్రంలో శ్రీ వైద్య భుజరంగరావు మెమోరియల్ ఆయుర్వేద దవాఖానలో అందిస్తున్న ఔషద మందులు మంచిగా పనిచేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆయుర్వేద మందును 150 ఏండ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వారు నేటికీ కొనసాగిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే వనమూలికలతో తయారు చేసి వివిధ రకాల వ్యాధులకు మందులు అందిస్తున్నారు. మొట్టమొదటిగా భుజరంగరావు అనే వ్యక్తి పక్షవాతానికి మందులివ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులైన నర్సింగ్రావు, భుజరంగరావు-2, ఆయన కుమారుడు డాక్టర్ జయంత్రావు, డాక్టర్ నీరూప మందు పంపిణీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఔషద మందులకు అవసరమైన హెర్బల్ మొక్కలను స్వయంగా పెంచడంతోపాటు మందుల తయారీలో కూడా కుటుంబ సభ్యులే పాల్గొంటున్నారు. పక్షవాతం మందుకు గుర్మిట్కల్ ఫేమస్గా మారింది.
అతి తక్కువ ధరకే మందులు..
పలు దవాఖానల్లో వేలకు వేలు ఖర్చు పెట్టినప్పటికీ తక్కువ కాని వ్యాధిని ఇక్కడ నయం చేస్తున్నారు. గుర్మిట్కల్లో అందిస్తున్న ఆయుర్వేద వైద్యాన్ని తెలుసుకొని నిత్యం వేల సంఖ్యలో రోగులు మందుల కోసం బారులు తీరుతున్నారు. అలోపతి మందులతోపాటు వీటిని కూడా ఉపయోగిస్తున్నారు. కన్సల్టేషన్ ఫీజు లేకుండా కేవలం మందుల కోసం మాత్రమే డబ్బులు తీసుకుంటుండడం గమనార్హం. పక్షవాతానికి గుర్మిట్కల్లో అందిస్తున్న ఔషద మందు సత్ఫలితాలిస్తుండడంతో నిత్యం వేల సంఖ్యలో రోగులు తరలివస్తుంటారు. కేవలం ఒక్క కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పక్షవాతం రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పక్షవాతం రోగులు, బంధువులతో కిక్కిరిసిపోతుంది. గురువారం మాత్రమే దవాఖానకు సెలవు ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 1 గంటల వరకు.. తిరిగి 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దవాఖాన తెరిచి ఉంటుంది.
ఎంతో మందికి ఉపాధి..
గుర్మిట్కల్లోని శ్రీ వైద్య భుజంగరావు మెమోరియల్ దవాఖాన నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిత్యం వందల మందికి ఉపాధి కలుగుతుంది. హెర్బల్ మందుల తయారీకి, విక్రయం, దవాఖానలో పని చేసే సిబ్బంది, పరిసర ప్రాంతాల్లో వెలసిన హోటళ్లు, దుకాణాలతోపాటు ఆటో, జీపుల వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.
కొవిడ్తో నిలిచిన మందు పంపిణీ..
కొవిడ్ కారణంగా కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతుండడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం గుర్మిట్కల్లో మందుల పంపిణీ నిలిపివేశారు. లాక్డౌన్ తర్వాత మళ్లీ ప్రారంభించనున్నారు.
సొంత పొలంలోనే మొక్కల పెంపకం..
ఆయుర్వేద మొక్కలతో మందులను తయారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా మొక్కలను కొనుగోలు చేసి తెప్పించుకొనేవారు. కొన్ని సందర్భాల్లో మొక్కలు లభించక, దొరికినా రవాణా సమస్యలతో సమయానికి వచ్చేవి కావు. దీంతో రోగులకు సరైన సమయంలో మందులు ఇవ్వలేని పరిస్థితులు ఉండేవి. వీటిని దృష్టిలో ఉంచుకున్న నిర్వాహకులు గుర్మిట్కల్-నారాయణపేట మార్గంలో మూడెకరాల పొలాన్ని కొనుగోలు చేసి అందులో ఔషద మొక్కలను పెంచుతున్నారు. తెంచిన ఆకులను ఎండకు ఆరబెట్టి, ఆ తర్వాత వాటిని పొడిగా చేసి మందులుగా మారుస్తున్నారు. కొంత మంది సహాయకుల ద్వారా తమ ఇంట్లోనే ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి కుటుంబసభ్యులే స్వయంగా మందులు తయారు చేస్తున్నారు.