లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు గడ్డు రోజులు మొదలయ్యాయని, సీఎం పీఠం కాపాడుకునేందుకు ఆయన ఇల్లిల్లూ తిరుగుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలో నాయకత్వ మార్పుపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు కరోనా మహమ్మారితో బాధపడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
యూపీలో కరోనా విస్తరిస్తుండటంతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సలో మందుల కొరత వెంటాడుతోందని అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మరణాలపై సరైన గణాంకాలు ఇవ్వడం లేదని యోగి సర్కార్ తీరును తప్పుపట్టారు. మరోవైపు యూపీలో నాయకత్వ మార్పు తప్పదనే వార్తల నేపథ్యంలో సీఎం యోగి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు.