న్యూయార్క్: చైనాలోని మైనార్టీలపై ఆ దేశం వేధింపులకు పాల్పడుతున్నది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఉయిగర్ ముస్లింలతో పాటు ఇతర తెగలకు చెందిన ప్రజలను డ్రాగన్ దేశం అణిచివేస్తున్నది. వ్యవస్థీకృత రీతిలో స్థానిక ముస్లింలను అరెస్టు చేస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషన్ పేర్కొన్నది. మానవత్వానికి వ్యతిరేకంగా చైనా నేరాలకు పాల్పడుతున్నట్లు ఆమ్నెస్టీ ఆరోపించింది. చైనా అకృత్యాలకు సంబంధించిన నివేదికను ఆమ్నెస్టీ రిలీజ్ చేసింది. ఆ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. ఉయిగర్స్, కజక్స్తో పాటు ఇతర మైనార్టీలను అక్రమరీతిలో నిర్బంధిస్తున్నారని అమ్నెస్టీ ఆరోపించింది. డిటెన్షన్ సెంటర్లో బంధించి.. తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నది.
జిన్జియాంగ్ ప్రావిన్సులో చైనా అత్యంత దుర్భరమైన నరకాన్ని సృష్టిస్తున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ ఆగ్నెస్ కల్లమార్డ్ తెలిపారు. వేలాది సంఖ్యలో మైనార్టీ ముస్లింలను, ఇతరులను జైళ్లలో నిర్బంధించి వారిని వేధిస్తున్నారని, ఇక లక్షలాది మందిపై నిఘా పెట్టి వారంతా భయంలో జీవించేలా చేస్తున్నట్లు కల్లమార్డ్ ఆరోపించారు. చైనాలో మైనార్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడంలో ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ గుటెర్రస్ విఫలమైనట్లు ఆమె పేర్కొన్నారు. 55 మంది నిర్బంధ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసిన అమ్నెస్టీ మొత్తం 160 పేజీల నివేదికను రిలీజ్ చేసింది.