న్యూఢిల్లీ : హెల్త్కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్లకు కరోనా టీకా రెండో డోసు వేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సూచించారు. టీకాల కవరేజీ, కొవిన్ ప్లాట్ఫామ్ మరింత ప్రభావంతంగా ఉండేందుకు చేసిన మార్పుల వివరాలను తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా రెండో మోతాదు పంపిణీని వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు, యూటీలు సమర్థవంతమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. అలాగే ప్రత్యేకంగా సెషన్లు ఏర్పాటు చేయడంతో పాటు టైమ్ స్లాట్లు కేటాయించాలని సూచించారు. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. హెల్త్కేర్ వర్కర్లలో టీకా ఫస్ట్ డోస్ జాతీయ సగటు 82 శాతం కాగా.. రెండో మోతాదు తీసుకున్న వారి శాతం 56 శాతమే.
పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, అసోం సహా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే వ్యాక్సిన్ కవరేజీ తక్కువగా ఉన్నది. ఫ్రంట్లైన్ వర్కర్లలో ఫస్ట్ డోస్ జాతీయ సగటు 85శాతంగా ఉండగా, రెండో మోతాదు శాతం 47శాతమే. 19 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. ఇందులో బిహార్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొవిన్ పోర్టల్లో 12 భాషలు అందుబాటులోకి తీసువచ్చినట్లు పేర్కొంది. మహమ్మారి నుంచి ఆరోగ్య సంరక్షణను పూర్తి స్థాయిలో కాపాడేందుకు టీకా షెడ్యూల్ సకాలంలో పూర్తి చేయడం ముఖ్యమని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.