చివ్వెంల, జూన్ 8 : ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా.. పోలీసులు భగ్నం చేసి 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రూరల్ సీఐ విఠల్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న కుడకుడ గ్రామ శివారులో గల శంకర్రెడ్డి గెస్ట్హౌస్పై పోలీసులు దాడి చేసి ప్రధాన నిందితుడు బూర చంద్రశేఖర్ సహా పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిరేకల్కు చెందిన ఉప్పుల శ్రీనివాస్ గతంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలో ఉన్న సందర్భంలో అతని రెండో భార్య పద్మశ్రీతో కుడకుడకు చెందిన బూర చంద్రశేఖర్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో పద్మశ్రీకి చెందిన ఏడు ఎకరాల భూమిని తక్కువ ధరకు అదే ప్రాంతానికి చెందిన గుర్రం శశిధర్రెడ్డికి అమ్మించాడు. ఆ భూమి విషయంలో ఉప్పుల శ్రీనివాస్, శశిధర్రెడ్డి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న కుడకుడ శివారులో ఉప్పుల శ్రీనివాస్ గుర్రం శశిధర్రెడ్డిని కిరాయి హంతకులతో హత్య చేయించాడు. దీంతో తనను కూడా చంపుతాడని భయపడిన బూర చంద్రశేఖర్.. ఉప్పుల శ్రీనివాస్ను హత్య చేయాలని కిరాయి హంతకులతో కలిసి ప్రయత్నించాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రెండు సార్లు విఫలయత్నం..
నకిరేకల్కు చెందిన ఉప్పుల శ్రీనివాస్ అలియాస్ ఆయిల్ శ్రీనును హత్య చేసేందుకు గత నెల 25న, ఈ నెల 1న అతని భూమి వద్ద హత్యకు యత్నించగా తృటిలో తప్పించుకున్నాడు. రెండు సార్లు విఫలయత్నం కాగా మరోమారు ప్రయత్నం చేయకముందే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కుడకుడకు చెందిన బూర చంద్రశేఖర్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్కు చెందిన పొలాస మహేందర్, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన బందారి వీరన్న, పల్సా రమేశ్, షేక్ ఇస్మాయిల్, కుమ్రంభీం జిల్లా ఖాగజ్నగర్కు చెందిన చందుపట్ల సంతోష్రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బొజ్జ మల్లేశ్, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండకు చెందిన పంతంగి ప్రవీణ్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జన్ను కోటి, దామెర రాజేశ్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రామవరానికి చెందిన జినుకుల కమలాకర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, 11 సెల్ఫోన్లు, 8 కర్రలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ విష్ణుమూర్తి, సిబ్బందిని సీఐ అభినందించారు.