మైదుకూరు: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఏడవ తరం 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వెంకటేశ్వరస్వామి వారసుని ఎంపిక వివాదం సామరస్యంగా పరిష్కరిస్తామని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. మే 8వ తేదీన వీర భోగ వెంకటేశ్వర స్వామి శివైక్యం అనంతరం పీఠం కోసం వారసుల మధ్య గట్టి పోటీ తలెత్తింది. ఈ నేపథ్యంలో శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి అధ్యక్షతన పీఠాధిపతుల బృందం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నది. 11వ పీఠాధిపతి పెద్ద భార్య సంతానానికి, చిన్న భార్య సంతానానికి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించి ఇరువర్గాలను సమన్వయ పరుస్తామని స్వాములు స్పష్టంచేశారు. కోర్టు వివాదాలతో బ్రహ్మంగారి మఠం ప్రతిష్ఠ దిగజారకుండా.. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.