సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల దోపిడీ పర్వం కొనసాగుతున్నది. మహేంద్రహిల్స్లో నివాసముండే వైద్యురాలికి ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సీ రాంమోస్ అనే పేరుతో వీసా ప్రాసెసింగ్ అనే ఒక ప్రకటన కనిపించింది. అందులోని నంబర్కు సదరు డాక్టర్ ఫోన్ చేసింది. కెనడాలో వైద్య వృత్తికి మంచి డిమాండ్ ఉందని, మీకు వెంటనే ఉద్యోగం వస్తుందని, త్వరలో వీసా ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నమ్మించాడు. రూ. 20 వేలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ సూచించడంతో వైద్యురాలు చెల్లించింది. ఆ తరువాత వివిధ కారణాలు చెబుతూ రూ. 10 లక్షలు వసూలు చేశాడు. ఇదంతా సైబర్నేరగాళ్ల పని అని గుర్తించిన బాధితురాలు గురువారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యూసుఫ్గూడకు చెందిన రాజా తన స్నేహితులు ద్వారా ఆన్లైన్ జాబ్స్ గురించి తెలుసుకున్నాడు. ఆన్లైన్ వర్క్ గురించి ఆరా తీసి.. వారిని ఈమెయిల్లో సంప్రదించాడు. తమ వద్ద కొంత డబ్బు డిపాజిట్ చేస్తే ప్యాకేజీల వారీగా పని ఆర్డర్ ఇస్తామని సైబర్నేరగాళ్లు అతడిని నమ్మించారు. డబ్బు వస్తుందని తన స్నేహితుడైన సత్యం నగేశ్ కూడా చెప్పడంతో అది నిజమని నమ్మి రూ. 1.89 లక్షలు డిపాజిట్ చేశాడు. ఒకటెండ్రోజులు ఆన్లైన్ వర్క్ ఇచ్చినట్లు చేసి తరువాత నేరగాళ్లు సెల్ఫోన్లు స్విచాఫ్ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనలాగా సుమారు 18 మంది వరకు మోసపోయి ఉంటారని, బాధితుడు సైబర్క్రైమ్స్ ఏసీపీకి వివరించాడు. కేసు దర్యాప్తులో ఉంది.
యూసుఫ్గూడకు చెందిన సిద్ధార్థకు ఫేస్బుక్లో రీత్ కమల్ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన కు తాను ఫిలిప్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇండియా హెడ్గా చెప్పుకున్నాడు. చాటింగ్లో వ్యాపారానికి సం బంధించిన విషయాలు మాట్లాడుకున్న తరువాత ఆన్లైన్లో కాన్సన్ట్రేటర్లు పంపిస్తామంటూ నమ్మించాడు. వ్యాపారి ఐదింటికి రూ. 2.93 లక్షలు డిపాజిట్ చేశాడు. ఆ తరువాత సైబర్నేరగాడి సెల్ఫోన్ పనిచేయలేదు.
గుడిమల్కాపూర్కు చెందిన గౌరవ్ తివారీ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కారు అమ్మకం ప్రకటన చూశాడు. అమ్మకందారుకు ఫోన్ చేయడంతో తాను ఆర్మీ అధికారినంటూ చెప్పుకున్నాడు. భేరసారాల తరువాత కారును రూ. 45 వేలకు అమ్మేందుకు ఒప్పుకున్నాడు. దీంతో గౌరవ్ తివారీ కొంత అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఆ తరువాత ప్యాకింగ్, ట్రాన్స్పోర్టు, ఆర్టీఏ చార్జీలంటూ.. రూ. 1.39 లక్షలు వసూలు చేశాడు. రూ. 45 వేలకు కారు వస్తుందనుకుంటే రూ. 1.39 లక్షలు పోయాయంటూ బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు కేసుకొని దర్యాప్తు చేపట్టారు.