గువాహటి: అతనో ప్రజాధరణ కలిగిన నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితేనేం.. అంతా తనకు సమానమే అన్నట్లు కరోనా మహమ్మారి అతని ప్రాణాలను బలితీసుకుంది. అసోంలోని గస్సైగామ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మజేంద్ర నర్జారీ కరోనా అనంతర సమస్యలతో కన్నుమూశారు. 68 ఏండ్ల ఆయన కరోనా సోకడంతో గువాహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో (GMCH) చికిత్స పొందారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న ఆయన.. కరోనా అనంతర సమస్యలతో మళ్లీ అదే దవాఖానలో చేరారు. చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) తరఫున గస్సైగామ్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు విజయం సాధించారు.
మజేంద్ర మృతిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ సర్మ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.