జీడిమెట్ల, మే 23: నిబంధనలు ఉల్లంఘిస్తే పాసులు రద్దు చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఆదివారం బాలానగర్ జోన్ పరిధిలోని షాపూర్నగర్, చింతల్, గణేశ్నగర్, భగత్సింగ్నగర్, జగద్గిరిగుట్ట, చంద్రగిరినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఉదయం వెసులుబాటు కల్పించిన సమయంలో సైతం ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు.
ప్రజలంతా ఉదయం 10 గంటల నుంచి ఇండ్లకే పరిమితం కావాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 102 జీవో ప్రకారం పాసులు ఇస్తున్నామని, పాసులు పొందిన వారు అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. లేనిపక్షంలో పాసులు రద్దుచేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, అదనపు డీసీపీ మాణిక్రాజు, బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ, బాలానగర్ ఏసీపీ పురుశోత్తంయాదవ్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట సీఐలు కె.బాలరాజు, పి.సైదులు తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో,మే 23(నమస్తే తెలంగాణ): మీ కోసం మేము.. 24 గంటలు రోడ్లపై ఉంటున్నాం.. మీరు కూడా సురక్షితంగా ఇంట్లోనే ఉండండి. కరోనా మహమ్మారిని బ్రేక్ చేయండని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రజలను కోరారు. ఆదివారం సీపీ చౌటుప్పల్, కొత్తగూడ, అబ్దుల్లాపూర్మెట్, భాగ్యలత కాలనీ, హయత్నగర్, పనమా గోడౌన్స్, వనస్థలిపురం, చింతలకుంట, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పతంగి టోల్గేట్ వద్ద బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి శానిటైజర్లు, స్నాక్స్ అందించారు.